సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల యావత్ సినీ, ప్రేక్షక లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కృష్ణ అభిమానుల వరకూ ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ఏపీ సీఎం జగన్, గవర్నర్ తమిళ్ సై సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అక్కడే ఉండడంతో వారి భద్రతా రీత్యా పోలీసులు కృష్ణ అభిమానులను లోపలకి అనుమతించడం లేదు. బారీకేడ్లు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే కృష్ణను కడసారిగా చూసుకోవాలని అభిమానులు పోలీసులను రిక్వస్ట్ చేశారు.
చాలా దూరం నుంచి వచ్చామని, చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నామని, ఒక్కసారి చూడనివ్వండి అంటూ బతిమాలాడారు. కానీ పోలీసులు లోపల వీఐపీలు ఉన్నారని అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ అభిమానులు ఒక్కసారిగా బారీకేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. పరిస్థితి అభిమానులు సహకరించకపోవడంతో అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేయవలసి వచ్చింది. ఈ ఘటనలో ఒక అభిమాని తలకి గాయమైంది. దీంతో అతని ఆసుపత్రికి తరలించారు. కాగా మరి కాసేపట్లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.