Chiranjeevi: ఈ మధ్యకాలంలో ప్రతివారం మినిమమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ కూడా విడుదలకు సిద్ధమైంది. తాజాగా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరై.. హీరో గోపీచంద్ తో తనకున్న అనుబంధాన్ని స్టేజిపై షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. “గోపీచంద్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం మీకేమైనా తెలుసా? నేను ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ లో చేరినప్పుడు.. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గారు బీకాం ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. కొత్తగా వచ్చిన అబ్బాయెవరో రమ్మనండి అంటూ టి.కృష్ణ గారు నన్ను పిలిపించారు. నేను స్టూడెంట్ లీడర్ గా నిలబడుతున్నాను. నీ మద్దతు నాకు కావాలి. నీకెలాంటి సహకారం కావాలన్నా నన్నడుగు అంటూ, కృష్ణ గారు ఓ పెద్దన్నలా భరోసా ఇచ్చారు. ఆయనెప్పుడూ నాకు హీరోలా అనిపిస్తారు.
ఆ తర్వాత ఆయన, నేను సినిమా రంగంలోకి వచ్చాం. కృష్ణ గారు ఎన్నో సందేశాత్మక సూపర్ హిట్ సినిమాలు తీసి దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ.. ఆయన సినిమా ప్యాషన్ ని ఆయన కుమారుడు గోపీచంద్ తనదైన శైలిలో కొనసాగిస్తున్నాడు. కమర్షియల్ హీరోగా అన్ని హంగులు ఉన్న గోపీచంద్. ఈ పక్కా కమర్షియల్ చిత్రం ద్వారా తను మరింత ఉన్నతస్థాయికి చేరతాడనడంలో ఎలాంటి సందేహం లేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చిరు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.