కొంతమంది హీరోల విషయంలో అభిమానులకు ఒక వెలితి ఉండిపోతుంది. మా హీరో ఆ కేరెక్టర్ చేసి ఉంటే బాగుండేది, ఆ హీరోతో చేసి ఉంటే బాగుండేది, ఆ డైరెక్టర్తో ఓ సినిమా పడితే బాగుండేది అని ఇలా రకరకాలుగా వెలితి ఉంటుంది. మహేష్ బాబు విషయంలో కూడా ఫ్యాన్స్కు వెలితి ఉంది. ఒకటి రాజమౌళి సినిమాలో నటించడం, రెండు మహేష్ను మీసాలతో చూడడం, మూడు డ్యూయల్ రోల్లో చేస్తే చూడాలనుకోవడం.. ఇవే ఫ్యాన్స్కున్న వెలితి. ఇప్పటికే రాజమౌళితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మీసాలతో ఫుల్ లెంత్ రోల్లో చూడొచ్చునని, దీంతో ఆ వెలితి కూడా తీరిపోతుందని అనుకుంటున్నారు. భరత్ అనే నేను మూవీలో ఒక పాటలో కాసేపు మీసాలతో కనబడి ఫ్యాన్స్కు మాంచి కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంకో వెలితిని కూడా తీర్చే పనిలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
బాల నటుడిగా 1989లో వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన మహేష్.. హీరో అయ్యాక డ్యూయల్ రోల్లో నటించిన సినిమా నాని. అది కూడా చిన్న పాత్రే. ఈ సినిమాలో క్లైమాక్స్లో మహేష్ బాబుకి తండ్రిగా కనబడతారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా దీన్ని ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఫుల్ లెంత్ రోల్లో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో SSMB 28వ సినిమాకి సంబంధించి సరికొత్త న్యూస్ ఒకటి ఫ్యాన్స్ని ఖుషీ చేస్తోంది.
ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ మూవీలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో రెండో మహేష్ బాబు కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో మొదటి మహేష్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. రెండో మహేష్ కోసం సంయుక్త మీనన్ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ డిమాండ్ మేరకు ఈ సినిమాలో ఇద్దరు మహేష్ బాబులు ఉంటారని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు గానీ.. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్కి మాత్రం పండగే.
అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్, మహేష్లిద్దరూ కలిసి జత కడుతుండడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరి కాంబినేసన్లో వచ్చిన అతడు సూపర్ హిట్ కాగా, ఖలేజా ఫ్లాప్గా నిలిచింది. పన్నెండేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ వర్కవుట్ కావడంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో టేకింగ్ స్టైల్ మార్చడంతో త్రివిక్రమ్పై మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. మరి మహేష్ బాబు డ్యూయల్ రోల్పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.