సినిమాలకి, రాజకీయాలకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ సినిమా, రాజకీయం రెండూ నాణానికి చెరో వైపున ఉండే బొమ్మ, బొరుసు లాంటివి. రాజకీయ నాయకులు సినిమాలు చేస్తారు, సినిమాల్లో పెట్టుబడులు పెడతారు. అలానే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేస్తారు. సినిమా వాళ్ళ క్రేజ్ ని రాజకీయ నాయకులు తమ పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటారు కూడా. ఈ క్రమంలో తమ క్రేజ్ ని రాజకీయాల్లో స్వయంగా వాడుకుని నాయకులుగా ఎదగాలని ప్రతీ సెలబ్రిటీ అనుకుంటారు. ఈ క్రమంలో హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తారు. ఇప్పటికే ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. ప్రజల గుండెల్లో రాజకీయ నాయకులుగా చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా మరో నటి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.
జాతీయ నటి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన రాజకీయ ఆసక్తిని బయటపెట్టారు. అవకాశం వస్తే ప్రజాసేవకు తాను సిద్ధమే అని వెల్లడించారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కి సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సొంత రాష్ట్ర ప్రజల కోసం అవకాశం వస్తే సేవ చేస్తానని ఆమె అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆమె ఈ విధంగా స్పందించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆమె అన్నారు. తాను సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ పార్టీ కోరుకుంటే.. మండీ ప్రాంతం నుంచే పోటీ చేస్తానని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే దేశంలో తనకంటే గొప్ప వారు చాలా మంది ఉన్నారని, వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చానని, మోదీ పనితీరు నచ్చి కుటుంబమంతా బీజేపీ వైపు నిలిచిందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత భారత్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ప్రతీ భారతీయుడితో జాతీయ భావం కనిపిస్తోందని అన్నారు. సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తున్నందున ప్రతీ భారతీయుడితో మోదీతో దగ్గర బంధం ఏర్పడినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మోదీకి పోటీ కాదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పని చేయవని, బూటకపు వాగ్ధానాలతో ప్రజలను నమ్మించలేరని అన్నారు.
కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ అనే పొలిటికల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ లుక్ లో కంగనా.. డిట్టో ఇందిరా గాంధీలానే కనబడుతున్నారు. 1975 నుంచి 1977 మధ్యలో ఇందిరా గాంధీ దేశ వ్యాప్తంగా విధించిన ఎమర్జన్సీ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలను తెరకెక్కిస్తున్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కుతుందని బీజేపేతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎన్నికలు కూడా వస్తాయి. బీజేపీ టికెట్ ఇస్తే సినిమా క్రేజ్ తో రాజకీయాల్లో నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే కంగనా తన రాజకీయ ఆసక్తిని బయటపెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరి కంగనా కోరికని బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారో లేదో చూడాలి.