తెలంగాణ హైకోర్టులో హీరో వెంకటేష్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. వారి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దాంతో ఏళ్లుగా సాగుతున్న భూ వివాదానికి ముగింపు లభించింది. ఆ వివరాలు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన వివాదంలో తాజాగా తెలంగాణ హైకోర్టు రామానాయుడి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ భూములు రామానాయుడి కుటుంబానికి చెందనవిగా తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
వివాదం ఏంటంటే..
1996 సంవతర్సంలో హీరో వెంకటేష్ తండ్రి రామానాయుడు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో కొన్ని భూములను కొనుగోలు చేశారు. ఆ భూములతోపాటు ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవిందరెడ్డి తదితరులకు చెందిన 26.16 ఎకరాల భూమి కూడా ఉంది. వీటికి సంబంధించిన హక్కుల వివాదం నడుస్తోంది. ఆ వ్యవహారంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేస్తూ ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేసింది. తాజాగా వీటిపై సుదీర్ఘ వాదనలను విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం బుధవారం రామానాయుడు కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఆ భూములు రామానాయుడు కుటుంబానికి చెందినవేనని హై కోర్టు తేల్చింది.
‘‘రామానాయుడుతో పాటు మిగతా వారు రికార్డును తారుమారు చేశారని, మోసపూరిత పత్రాలు సృష్టించారని ప్రభుత్వం ఎక్కడా ఆరోపణలు చేయలేదు. దీనికి సంబంధించి రికార్డుల్లో కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. 1961లో అసైన్మెంట్ తప్పని చెబుతున్నారు.. 1963లో మాజీ సైనికులకు భూ కేటాయింపు జీవో వచ్చినపుడు, గతంలో చేసిన అసైన్మెంట్ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూమిని కేటాయించిన 5 దశాబ్దాల తరువాత.. అది కూడా అనుబంధ సేత్వార్ జారీ చేసిన 15 ఏళ్ల తరువాత చర్యలు ప్రారంభించడం సరికాదు. అనుబంధ సేత్వార్ను రద్దు చేయడం చెల్లదు. ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదు’’ అంటూ ప్రభుత్వ అప్పీళ్లను ధర్మాసనం కొట్టివేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.