ఉరికే ఉరికే మనసే ఉరికే అంటూ హిట్ 2 సినిమాలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు ఎం ఎం శ్రీలేఖ. అప్పడే ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. నాన్నగారు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ద్విగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క మహిళా మ్యూజిక్ కంపోజర్ ఎం. ఎం శ్రీలేఖ. అత్యంత చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అనేక సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ను అందించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాకుండా అనేక సినిమాలకు పాటలు కూడా పాడారు. ఎం.ఎం కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళిలు ఆమెకు కజిన్స్. తెలుగులో నాన్నగారు సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. ఇటీవల హిట్ 2 సినిమాతోనూ అలరించారు. ఐదు భాషల్లో సుమారు 80 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. ఆమె సినిమా పరిశ్రమకు పరిచమై పాతికేళ్లు నిండాయి. ఈ సందర్భంగా 25 దేశాల్లో 25 మంది సింగర్స్ తో ఈ నెల 17 నుండి వరల్డ్ మ్యూజిక్ టూర్ ని ప్రారంభించబోతున్నారు.
ఇండియా, ఖతార్, యు. ఏ. ఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, నార్వే, యు కె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ , స్వీడెన్, ఫిన్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, నైజీరియా, యు యస్ ఏ, బోట్స్వానా, కెనడా, సింగపూర్, మలేసియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మ్యూజిక్ డైరెక్టర్ కు ఎంత స్ట్రగుల్ ఉంటుందనేది నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తరువాత తెలిసింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను అంటే నన్ను కన్న తల్లి తండ్రులు, మా చిన్నాన్న విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ రామకృష్ణ ముఖ్య కారణం. నా 25 సంవత్సరాల ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదములు. నాకు తోడుగా ఉన్న నా మ్యూజిషన్స్, సింగర్స్, లిరిక్ రైటర్స్కీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను చిన్న పిల్ల అనుకోకుండా పెద్దలు దాసరి నారాయణ, రామానాయుడు, ముప్పల నేని శివ, చంద్ర మహేష్ ఇలా అందరూ నాకు అవకాశం ఇవ్వడంతో నా ఈ జర్నీ విజయవంతంగా కొనసాగుతుంది’అని వ్యాఖ్యానించారు.
ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తాను ఇంకా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవిస్తున్నానని తెలిపారు. ఆస్తులు సంపాదించక పోయినా తన పాటలతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉందని అన్నారు. తాను ఇప్పటి వరకు డబ్బుల కోసం, ఆస్తులు కూడ బెట్టడం కోసం పని చేయలేదని, తన ఆత్మ సంతృప్తి కోసమే పని చేశానన్నారు. కొన్ని సందర్భాల్లో నా సొంత డబ్బులు పెట్టి అవసరమైన మేరకు ఎక్విప్మెంట్స్ కొన్నానని తెలిపారు. ఈ సందర్భంగా రచయిత విజేయంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు నేను శ్రీ లేఖకు ఒక ఆశ చూపించాను.ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. ఆ తరువాత తను కష్టపడి ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు తన అన్న కీరవాణి మ్యూజిక్ లో ఆస్కార్ అందుకోబోతుండగా రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో తన అన్న లాగే శ్రీ లేఖ కూడా మంచి మ్యూజిక్ చేసి ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ..ఎం.ఎం. శ్రీ లేఖ మంచి మ్యూజిక్ కంపోజర్, మంచి సింగర్ అని, అందుకే తనంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. తను చేస్తున్న 25 వరల్డ్ మ్యూజిక్ టూర్ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ హైకోర్ట్ జడ్జ్ నంద విచ్చేశారు. ప్రముఖ దర్శకులు విజయేంద్ర ప్రసాద్, కమెడీయన్ ఆలీ, సంగీత దర్శకులు కోటి , దర్శకులు ముప్పల నేని శివ, చంద్ర మహేష్, వేణు శ్రీ రంగం, భారతీ బాబు, శైలేష్ కొలను, వై. వి యస్. చౌదరి, గేయ రచయిత చంద్ర బోస్, లిరిసిస్ట్ భాస్కరపట్ల, లక్ష్మీ భూపాల్ తదితరులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు.