సాధారణంగా చిత్ర పరిశ్రమంలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజే వేరు. తొలి భాగం హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీయడం ఇండస్ట్రీలో సహజమే. పైగా ఇటీవల కాలంలో హాలీవుడ్ తరహాలో సిరీస్ లుగా కథలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. ఇప్పటికే ఖైదీ కి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ మూవీ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్ – 2. హిట్ 1 కి సీక్వెల్ గా ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే అభిమానుల గుండెలను కొల్లగొట్టి, వారిని ఆలోచింప చేసిన మరో సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సూర్య.. వెండితెరకు పరిచయం అయినప్పటి నుంచి తనదైన కథల ఎంపికతో దూసుకెళ్తున్నారు హీరో సూర్య. అదీకాక తమిళంతో పాటుగా సమానంగా ఇక్కడ అతడికి మార్కెట్ ఉంది. దాంతో స్ట్రైట్ గా కూడా తెలుగు సినిమాలు చేస్తున్నాడు సూర్య. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోవడం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే దర్శకులు జ్ఞానవేల్ డైరెక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన చిత్రం జై భీమ్. ఎలాంటి వాణిజ్యాంశాలు లేకుండా గిరిజనులకు జరిగిన అన్యాయంపై పోరాడిన న్యాయవాది చంద్రుగా సూర్య నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో.. దీనికి సీక్వెల్ ఉంటుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ల్లో జై భీమ్ ను ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవానికి హాజరైన దర్శకులు జ్ఞానవేల్ ను జై భీమ్ కు సీక్వెల్ ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా..”కచ్చితంగా ఉంటుంది. అది కూడా సూర్యనే హీరోగా తెరకెక్కిస్తాం. ఇక న్యాయవాది చంద్రు వాదించిన ఎన్నో గొప్ప గొప్ప కేసులు ఉన్నాయని, వాటిల్లో ఏదో ఒక కేసును కథగా తెరకెక్కిస్తాం” అని డైరెక్టర్ చెప్పారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ సైతం అంగీకరించాడు. దాంతో మరో సారి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హీరోగా సూర్యను చూడబోతున్నాం అని అభిమానులు తెగ సంబంరపడిపోతున్నారు.