డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంలో స్టార్ హీరోయిన్ డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో స్టార్ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదం గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు డింపుల్. రాహుల్ కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. డీసీపీ రాహుల్ అధికార బలంతో తన మీద తప్పుడు కేసు పెట్టారనేది డింపుల్ వాదన. ఆమె ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, డింపుల్ హయాతికి సీఆర్పీసీ 41ఏ నోటీసు కూడా ఇచ్చామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాది విక్టర్ డేవిడ్కూ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు తెలిపింది.
అలాగే ఈ కేసులో సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకు మాత్రమే వ్యవహరించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి ఇన్వెస్టిగేషన్కు అటెండ్ అవ్వాలని డింపుల్ హయాతీని కోర్టు ఆదేశించింది. కాగా, డింపుల్కు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వడంపై ఆమె న్యాయవాది స్పందించారు. డింపుల్ హయాతీపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. ఆమెతో డీసీపీ చాలాసార్లు అసభ్యంగా మాట్లాడారని పేర్కొన్నారు. డీసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళతో ఇలాగేనా నడుచుకునేది అని ఆయన క్వశ్చన్ చేశారు. దీని మీద డింపుల్ పోలీసు స్టేషన్లో కేసు కూడా వేశారు. అనంతరం తనపై కావాలనే కేసు పెట్టారని.. వెంటనే రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. డింపుల్ వేసిన పిటిషన్ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.