మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి రణరంగాన్ని తలపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయ పోరుని మరిపించేలా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏమి పవర్ ఉంది? అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనితీరు ఎలా ఉంటుంది? సినీ పెద్దలు ఏ ఆలోచనతో ‘మా’ ని స్థాపించారు? అసలు ‘మా’ చరిత్ర ఏమిటి? ఇప్పుడు ‘మా’ పరిస్థితి ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే.. ఓ 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఇంకా తమిళ వాసనలు వదలని రోజులు అవి. ఆ సమయంలో మన నటులంతా మద్రాసు కేంద్రంగా ఉండే దక్షిణాధి ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండేవారు. అప్పట్లో ఎవరి పని వారిది, ఎవరి కష్టం వారిది. కానీ.., ఓసారి రాష్ట్ర పోలీసు శాఖ సహాయార్ధం తెలుగు నటీనటులు అంతా కలసి విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఎంతో మంది పోలీసు కుటుంబాలను ఈ డబ్బు ఆదుకుంది. కళాకారులంతా కలిస్తే.. ఎంతటి సమస్యకైనా పరిష్కారం కనుగొనచ్చని నిరూపించిన ఘటన ఇది. ఈ కార్యక్రమం ఇచ్చిన నమ్మకంతో తెలుగు నటులకి కూడా ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకోవాలని అప్పటి సినీ పెద్దలు నిర్ణయించారు. యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, దాసరి నారాయాణ రావు, రామానాయుడుతో పాటు కొందరు ప్రముఖులు ఈ విషయంలో సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే కేరళ నటీనటుల అసోసియేషన్ ఆఫ్ మళయాళం అమ్మ తరహాలో ‘మా’ పేరుతో మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని భావించారు. కళాకారులకు అమ్మలాంటి మా సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించి ఏకగ్రీవంగా తీర్మానించారు. అలా.. తెలుగు సినిమా నటీనటులు సంక్షేమమే లక్ష్యంగా.. మెగాస్టార్ చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటైంది.
ఇదీ చదవండి: #PKLOVE హ్యాష్ టాగ్ తో పూనమ్ కౌర్ ట్వీట్… నెట్టింట వైరల్
1993 నుంచి 1995 వరకు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి కొనసాగారు. ఆ తర్వాత 1995లో ఘట్టమనేని కృష్ణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా నాలుగేళ్ల పాటు కృష్ణనే అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారు. ఆ తరువాత 1999లో మా అధ్యక్షుడిగా మురళీ మోహన్ ఎన్నిక అయ్యారు. ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవమే. మధ్యలో ఓసంవత్సర కాలం అక్కినేని నాగార్జున అధ్యక్షుడిగా సేవలు అందించినా, మళ్ళీ 2004 వరకు మా అధ్యక్షుడిగా మురళీ మోహన్ కొనసాగారు. ఇక 2004 నుంచి 2006 వరకు మా అధ్యక్షుడిగా మోహన్ బాబు, 2006 నుండి 2008 వరకు నాగబాబు, 2008 నుంచి 2015 వరకు మళ్ళీ మురళీ మోహన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మొత్తం ఈ 20 ఏళ్ళ కాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి స్వర్ణయుగం నడిచిందన చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఎన్నికలు, విమర్శలు, గ్రూప్ రాజకీయాలు వంటివి ఏమి లేకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రశాంతంగా సాగిపోయింది. అయితే.., 2015లో మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికవ్వగా, ఆయన టర్మ్ పూర్తి అయ్యాక ‘మా’ లో పదవుల కోసం రచ్చ మొదలయింది. 2017లో అధ్యక్షుడిగా శివాజీ రాజా, 2019లో నరేశ్ అధ్యక్షులుగా ఎన్నికైన విధానం, వారు చేసుకున్న విమర్శలు, ఇప్పుడు జరుగుతున్న గొడవలు అన్నీ కలసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువును బజారుకి ఈడ్చేశాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది కొన్ని ఉన్నతమైన లక్ష్యాలతోనే. నటీనటుల పారితోషికాలు, దర్శక, నిర్మాతల వివాదాలు పరిష్కరించుకోవడం, ఆర్టిస్టుల సంక్షేమం, వైద్య సాయం, పెన్షన్లు ఇవ్వడం లాంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా నిర్ధేశించుకున్నారు. అలాగే.. అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం.. అసోసియేషన్ బాధ్యతగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు.. చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి.. ఆయా విభాగాల కోసం పనిచేసేవారు. తొలినాళ్లలో ఈ కార్యక్రమాలు అన్నీ బాగానే జరుగుతూ వచ్చాయి. సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు, బెన్ఫిట్ షోలు, ప్రత్యేక క్రీడలు లాంటివి ఏర్పాటు చేసి ‘మా’ కి నిధిని సమకూర్చుకునేవారు. అలా కార్పస్ ఫండ్, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటయ్యాయి. ఇక ‘మా’ మెంబర్షిప్ ఫీజు ప్రస్తుతం లక్ష రూపాయలు. ఈ ఫీజులు, డిపాజిట్లపై వడ్డీలు, నటీనటుల నుంచి వచ్చే విరాళాలు ఇందుకు అదనం. నిజానికి ఇవన్నీ ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా పేద కళాకారులకి ‘మా’ నుండి ఈ సహాయ సహకారాలు అందుతున్నాయి. కానీ.., ప్రతిసారి ఎన్నికల సమయంలో జరిగే గొడవలు మా పరువు తీస్తున్నాయన్న భావన గట్టిగా వినిపిస్తోంది.
నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినంత మాత్రాన.. వారికి వ్యక్తిగతంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. అదేమీ ప్రభుత్వ నామినేటేడ్ పోస్ట్ కూడా కాదు. మా అధ్యక్షుడు అనేది జస్ట్ ఒక హోదా మాత్రమే. ఇండస్ట్రీలో ఉన్న వందల సమస్యలను నెత్తి మీదకి వేసుకున్నట్టే అవుతుంది. ఈ బాధ్యతలను మోయడానికే ప్రతిసారి ఇరు వర్గాల ప్యానెల్స్ బాహాటంగా గొడవలకి దిగుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా.., ఈ ఎన్నికల్లో అసోసియేషన్ సభ్యులు అందరూ ఓటు వేయరు. ప్రస్తుతం అసోసియేషన్ లో 850 మంది యాక్టివ్ మెంబర్లు ఉండగా, వారిలో సగం మంది కూడా ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోరు. 2019లో కూడా కేవలం 472 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా స్టార్స్ అంతా ఈ ఎన్నికలను లైట్ తీసుకుంటూ ఉంటారు. మరి.. ఈ మాత్రం ఎన్నికలకి ఎందుకు ఇంత రచ్చ చేసుకుంటున్నారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. మరి.. ఎంతో ఉన్నత లక్ష్యాలతో 26 ఏళ్ళ క్రితమే మన సినీ పెద్దలు ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ఇప్పుడు ఇలా వివాదాలకు కేంద్రం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
ఇదీ చదవండి: దీపక్ చాహర్ లవ్ సక్సెస్ కావడానికి ధోని కారణమా?