బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో జబర్దస్త్. ఎన్నో ఏళ్లుగా తెలుగు హాస్యప్రియులను అలరిస్తున్న ఈ షోలో అనసూయ యాంకర్ కాగా.. సీనియర్ సింగర్ మనో, నటి ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. జబర్దస్త్ నిర్వాహకులు పూర్తి ఎపిసోడ్ కి ముందుగా ప్రోమోలను వదులుతుంటారు కదా.. ఈ వారానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో అంతా.. అందరి స్కిట్లతో అదిరిపోయింది. అలాగే అందరూ టీమ్ లీడర్లు చక్కని కామెడీ స్కిట్లను ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలో ఒకరి స్కిట్ దగ్గర మాత్రం ఫ్యాన్స్ నుండి అభ్యంతరాలు తలెత్తుతుండటం గమనార్హం. ఈ ప్రోమోలో రాకెట్ రాఘవ.. ఐశ్వర్యతో కలిసి ‘వానజల్లు గిల్లుతుంటే..’ పాటకు మంచి స్టెప్పులేశాడు. అనంతరం స్టేజిపైకి వచ్చిన చలాకి చంటి.. ఈసారి తాగుబోతుల స్కిట్ తో వచ్చినట్లు తెలుస్తుంది. చంటి పంచులన్నీ బాగానే పేలాయి. కానీ మధ్యలో ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో’ పాటను మందు పాటగా మార్చి షాకిచ్చాడు.
`విస్కీదేవాలా బ్రాండీ దేవాలా.. గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట పక్కనా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్కకీ ముక్క ముక్కతో జుర్రుకోవాలా.. దొబ్బితాగాలా..` అంటూ కొమురం భీముడో పాటని చలాకీ చంటి తాగుబోతుల పాటగా మార్చడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. RRR సినిమాలో కొమురం భీం క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పాడే ఎమోషనల్ సాంగ్.. అందరిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. అలాంటి పవర్ ఫుల్ పాటను, గొప్ప సందర్భంలో ఉపయోగించిన పాటను తాగుబోతుల పాటగా మార్చుతారా? అని చంటిపై ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం చంటి పాడిన మద్యం పాట నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి చంటి మద్యం పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.