టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ నిమిత్తం ఆయన ఎక్కడికైనా వస్తున్నారు అంటే.. జనాలు ఎక్కడెక్కడి నుంచో.. ఆయనను చూడటానికి తరలి వస్తారు. అలాంటిది.. బన్నీ అత్తారింటికి వచ్చాడు అని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా.. అభిమానులకు పండుగే. ఇక ఆయనను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. తాజాగా అల్లు అర్జున్ అత్తాగారింటి వద్ద ఇదే పరిస్థితి ఏర్పాడింది. ఆదివారం బన్నీ.. తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి అత్తగారింటి వెళ్లాడు. ఆయనను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఆ వివరాలు..
అల్లు అర్జున్ భార్య.. స్నేహా రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలం చింతపల్లి. ఈ క్రమంలో స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తోడల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో కలిసి చింతపల్లి గ్రామానికి వచ్చి.. వీరారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న అత్తాగారింటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
ఇక అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో.. తమ సమీప బంధువుల పిల్లలు ఒకరిద్దరూ ఇంట్లోకి వెళ్లి అల్లు అర్జున్తో ఫోటోలు దిగారు. అయితే తమ అభిమాన హీరో వచ్చాడని తెలియడంతో చింతపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. అయితే బౌన్సర్లు మాత్రం.. అభిమానులను అడ్డుకున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫీలయ్యారు. తమ అభిమాన హీరో కోసం వస్తే.. కనీసం ఫోటో కూడా తీసుకోనీయకపోవడం ఏంటని నిరుత్సాహానికి గురయ్యారు. ఇక అల్లు అర్జున్ గతంలో దసరా పండుగ సందర్భంగా రెండు సార్టు చింతపల్లి గ్రామానికి వచ్చి.. సందడి చేశారు.