సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల హీరోల గురించి మాట్లాడేటప్పుడు సౌత్ ఇండియా హీరోలు, నార్త్ ఇండియా హీరోలు అని సంబోధించడం ఎన్నోసార్లు చూశాం. అలాగే మీడియాలో కూడా సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అని ఎన్నో కథనాలు వెలువడ్డాయి.. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అనే మాటను ఖండించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా జూన్ 3న రిలీజ్ కాబోతుంది.
ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్.. యాంకర్ అడిగిన ప్రశ్నకు సీరియస్ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. యాంకర్ మాట్లాడుతూ.. నార్త్ హీరోలను సౌత్ సినిమాలు, హీరోలు డామినేట్ చేయడం గురించి అడిగింది. వెంటనే స్పందించిన అక్షయ్ కుమార్.. “ముందుగా నార్త్ హీరోలు, సౌత్ హీరోలు అని మాట్లాడకండి. ఎంతకాలం చెబుతారు ఇలా.. నార్త్, సౌత్ అనేది ఇప్పటికే పాత విషయం అయిపోయింది.
మీరింకా విభజించి పాలించు అనే విధానాన్ని ఫాలో అవుతున్నారు. అలాంటి మాటలతో దయచేసి దేశాన్ని విడదీయడం ఆపండి. ఇంకా ఆ రకమైన దృశ్యాన్ని క్రియేట్ చేయకండి. సౌత్, నార్త్ అనేది ఏమిలేదు. ఇది ఇండియన్ ఇండస్ట్రీ. అందరూ హీరోలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని కుదిరితే నేను, అల్లు అర్జున్ కలిసి పని చేస్తాం.. మరో సౌత్ హీరో నాతో కలిసి పనిచేస్తారు. ఇకపై ఇదే మనం మాట్లాడాల్సింది” అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అక్షయ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మోడల్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూసూద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాను తెరకెక్కించారు. మరి సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అనే విషయంపై అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపించాయి అనేదానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.