సినీ ఇండస్ట్రీలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది సెలబ్రిటీల మధ్య హిందీ భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ల మధ్య మొదలైన ఈ హిందీ భాషా వివాదంలో మెల్లగా ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు. తాజాగా ఈ వివాదంలో ప్రముఖ నటి సుహాసిని కూడా వచ్చి చేరారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. యాక్టర్స్ అన్నాక అన్ని భాషలు నేర్చుకోవాలని అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం సుహాసిని మాటలు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “హిందీ అనేది మంచి లాంగ్వేజ్. అది కూడా నేర్చుకోవాలి. హిందీ మాట్లాడేవాళ్ళు మంచివారే.. తమిళం మాట్లాడేవారు మంచివారే. అన్ని భాషలు నేర్చుకుంటే మంచిదే. మా ఇంట్లో పనిచేసేవారు తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. కాబట్టి ఆయా భాషలవారితో మాట్లాడాలంటే ఆయా భాషలు నేర్చుకుంటే మంచిది. ఈ భాషే కావాలని పట్టుబడితే తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది” అని సుహాసిని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నటి సుహాసిని చేసిన వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ భాష నేర్చుకోవాలన్న సుహాసిని వ్యాఖ్యలను తమిళులు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలంటే ఆమె హిందీ సినిమాలే చేసుకుంటే బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు. మరి చిలికి చిలికి గాలివానగా మారిన హిందీ భాషా వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.