రెబల్ స్టార్… కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అపోలో వైద్యులు మంగళవారం (నేటి) ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారని తెలియగానే సినీ వర్గాల వారు, అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
దాదాపు ఆరు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు చేస్తున్నారు. కృష్ణం రాజు ప్రస్తుత వయసు 81ఏళ్ళు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన నట వారసుడు కాగా, రాధే శ్యామ్ మూవీలో సహనిర్మాతగా ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో ఆయన ఓ రోల్ చేసినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు స్వస్థలం. రెబల్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సాధించిన కృష్ణంరాజు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 183 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. మూడుసార్లు నంది అవార్డులు, ఐదుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు.
అయితే ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు, ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 1990లలో ఆయన క్రియాశీల రాజకీయాల్లోనూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీ , ప్రజారాజ్యం పార్టీలో ఆయన గతంలో పనిచేశారు. బీజేపీలో రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నిక య్యారు. 1999-2004 మధ్యకాలంలో ధివంగత వాజ్పేయి కేబినెట్లో కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. 2009లో ఆయన చిరంజీవి సారథ్యంలోని ప్రజరాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.