హైదరాబాద్ : రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 37 కంటే పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి.. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో చిన్నారులు, వృద్దులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకొనే ఆహారంలో మరింత శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ వరకూ ఆయిల్ ఫుడ్ తగ్గించడం మేలని వారు అంటున్నారు.
ద్రవ ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచి స్తున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కాటన్ దుస్తులే వేసుకోవాలి. బార్లీ గింజలు ఉడికిన తరువాత ఆనీళ్ళల్లో ఉప్పుగానీ, పంచదార ,నిమ్మరసం వేసుకొని తాగితే శరీరానికి చలువ చేస్తుంది. పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగడంవల్ల శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా మారుతుంది. పిల్లలకు,వృద్ధులకు పుదీనా రసం తాగించడం వల్ల వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడొచ్చు. నిత్యం పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, మంచినీళ్ళు, నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.