ఆ నీలకంఠేశ్వరుడి నామస్మరణలో భక్తులు పరవశించిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ పరమశివుని ఆరాధిస్తూ, ఆయన కటాక్షం కోసం భక్తులు పరితపిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ తరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా దేశం మొత్తం మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ శివయ్యను ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉంటూ.. రాత్రికి జాగరణ కూడా చేస్తారు. శివుడికి దగ్గరగా ఉంటూ శివారాధన, భజన, శివ కీర్తలను ఆలపిస్తూ ఉంటారు. నెలనెలా శివరాత్రులు వస్తాయి. కానీ, సంవత్సరంలో ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. పార్వతీపరమేశ్వరుల పెళ్లిరోజునే మహాశివరాత్రిగా పిలుస్తారు. ఈరోజ శివుడు తాండవం చేస్తాడు. శివారాధనకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే పూజలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అలాగే ఆ భోళాశంకరుడికి నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.
ఏ దేవుడు అయినా, ఏ పండుగ అయినా అది జరుపుకునేందుకు పురణాల్లో ఒక విధానం, పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారం భక్తిశ్రద్ధలతో ఆరాధన చేసుకుంటారు. అలాగే మహాశివరాత్రి రోజున చేసే పూజకు కూడా ఓ విధానం ఉంది. సూర్యోదయం చేసే తలస్నానంతో ఉపవాసం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి రోజు తెల్లవారుజాము వరకు ఈ ఉపవాస దీక్ష కొనసాగుతుంది. అయితే మరీ కఠినంగా ఈ ఉపవాసం చేయాలని పురాణాలు చెప్పడం లేదు. పండ్లు, పాలు వంటివి తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేనివారు దేవుడికి నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే పూజా విధానం కూడా నాలుగు దశల్లో ఉంటుంది. వీటిలో దేవుడికి నివేదించే నైవేద్యంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.
ఆ మహాశివునికి ఏం నైవేద్యం పెట్టాలి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అయితే పురాణాలు, పండితులు చెప్పే ప్రకారం ఆయనకు ఇది అంటే ఇష్టం అని ఏమీ లేదు. మీరు భక్తితో శివనామస్మరణ చేస్తూ ఏది సమర్పించుకున్నా ఆయన స్వీకరిస్తాడని చెబుతారు. చెంబుడు నీళ్లతో అభిషేకించినా, చిన్న మారేడు దళం సమర్పించినా పరవశించి పోతాడని చెబుతారు. ఆ శివయ్యకు పరామాణ్నం, పాయసం, దద్దోజనం, పండ్లు, ఫలములు ప్రీతిపాత్రమైంనవని పండితులు చెబుతున్నారు. భక్తుడు ఏదైతో తిని సంతృప్తి చెందుతాడో అదే నైవేద్యంగా పెట్టచ్చని, అలా పెట్టినా కూడా పరమశివుడు సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి.