మహేశ్వరం పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కానిస్టేబుల్ తేజావత్ రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు ప్రేమవ్యవహారమే కారణంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తేజావత్ రాజు మహేశ్వరం పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాచారం పీఎస్ పరిధి సింగం చెరువు తండాలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే తేజావత్ రాజు బంధువుల అమ్మాయితో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ప్రేమించిన యువతితో మనస్పర్థలు రావడంతో మానసికంగా రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్తాపంతోనే శనివారం రాత్రి ఉరివేసుకుని రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారేసరికి రాజు ఉరికి వేలాడుతూ కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బంధువుల వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారమే కారణమా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.