దంపతుల మధ్య సూటిపోటి మాటలు, గిల్లిగజ్జాలు సహజం. అత్త అనే హక్కుతో అప్పుడప్పుడు మాట అనడం కూడా కామనే. కానీ, తెచ్చిన కట్నం చాలదు.. ఇంకా తీసుకురా అంటూ దెప్పడం, వేధింపులకు గురి చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. కట్నం తీసుకునే వాడు గాడిద అని వినే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం నేను గాడిద కాదు.. అడ్డగాడిద కాబట్టి అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగక ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారు మొత్తం కూడగట్టుకుని సూటిపోటి మాటలతో పొడుచుకుతిన్నారు. అప్పులు తీర్చుకోవాలని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఆ తండ్రి అప్పో సొప్పో చేసి రూ.20 లక్షలు సర్దుబాటు చేశాడు. అయినా చాలదంటూ.. కట్టుకున్న భార్య, కన్న కూతురు అని లేకుండా కాటికి పంపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ దంపతులు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సంకలాపురంలో నివాసముండేవారు. వారి పెద్ద కుమార్తె పుష్పలత(24)ను గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన కుమ్మర తరుణ్ కుమార్ కు ఇచ్చి వివాహం చేశారు. వారి వివాహం 2020 డిసెంబరు 24న జరిగింది. పెళ్లి సమయంలో 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కూడా కట్నం కింద ఇచ్చినట్లు తెలిపారు. తరుణ్ కుమార్ రైస్ మిల్ నడుపుతుంటాడు. వారికి ఇటుకల వ్యాపారం కూడా ఉంది. మూడు నెలల క్రితమే పుష్పలత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వంశోద్ధారకుడు పుడతాడని ఎదురుచూసిన అత్తింటివారి గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. అప్పటి నుంచి పుష్పలతను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు.
పదిరోజుల క్రితమే పుట్టింటి నుంచి బిడ్డతో కలిసి పుష్పలత అత్తారింటికి వచ్చింది. సంగమేశ్వర ఆలయంలో పాపకు మోక్షిత అని నామకరణం కూడా చేశారు. అంతలోనే ఏమైందో ఏమో… ఆదివారం తెల్లవారుజామున పుష్పలత, మోక్షిత విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంకటేశులు ఫిర్యాదు మేరకు భర్త తరుణ్ కుమార్, మామ ఓబులేశు, అత్త లక్ష్మీదేవి, ఓబులేశు చిన్నల్లుడు హరిలను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తరుణ్ కుమార్ అసలు నిజాలను వెల్లడించాడు. భార్య గొంతు నులిమి, పసికందు ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అంతేకాదు పుష్పలత తండ్రి వారిపై అదనపు కట్నం ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: ప్రియుడు మోసం చేశాడంటూ.. యువతి ఊహించని నిర్ణయం
వ్యాపారంలో అప్పులు అయ్యాయని.. అవి తీర్చుకునేందుకు రూ.50 లక్షలు తీసుకురావాలంటూ పుష్పలతను వేధించేవారని ఆరోపించారు. తమ ఇంట్లో ఉన్న సమయంలోనే ఫోన్లు చేసి సూటిపోటి మాటలు అనేవారని తెలిపారు. అప్పటికే తాము అప్పుల్లో ఉండి కూడా.. కూతురి సంతోషం కోసం రూ.20 లక్షలు సర్దుబాటు చేశామంటూ వెంకటేశులు తెలిపారు. అక్కడితో ఆగక ఇంకా వేధింపులకు గురి చేయడం కొనసాగించారన్నారు. పరిస్థితి బాగోక డబ్బు ఇవ్వలేనని తేల్చి చెప్పడంతో ఇలా తమ కుమార్తెను.. మనవరాలిని దారుణంగా హత్య చేశారంటూ రోదించారు. వారి హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించాలని చూశారని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.