సాధారణంగా దొంగ చేసే మొదటిపని ఏంటి? ఎవరికంటా పడకుండా, అందినకాడికి దోచుకొని అక్కడినుంచి పారిపోవడం. ఇదేగా! కానీ మన కథలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. నిద్ర ముంచుకు రాగానే అక్కడే పడుకుని నిద్రపోయాడు. గదిలో నుంచి గురక శబ్ధం రావడంతో మేల్కొన్న ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఆసక్తికర ఘటన జరిగింది మరెక్కడో కాదు.. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో. ఈ వార్త విన్న స్థానికులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో సత్తి వెంకటరెడ్డి అనే వ్యక్తి స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజు లాగానే.. ఆరోజు కూడా రాత్రి 10 గంటలకు పెట్రోల్ బంక్ వద్ద పని ముగించుకుని, అమ్మకం డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే.. డబ్బు మీద దురాశతో వెంకటరెడ్డిని పసిగట్టిన సూరిబాబు అనే దొంగ ఆయనను ఫాలో అయ్యాడు. వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్లగానే ఆయన వెనకాలే చాకచక్యంగా సూరిబాబు ఇంట్లోకి దూరాడు. సరాసరి బెడ్రూంలోకి వెళ్లి ఆయన మంచం కిందనే దాక్కున్నాడు. అయన నిద్రపోయిన తర్వాత నగదు ఎత్తుకెళ్లాలనేది దొంగ ప్లాన్. అయితే, వెంకటరెడ్డి లెక్కలు చూసుకుని పడుకునే సరికి రాత్రి చాలా ఆలస్యమైంది. దీంతో ఆయన నిద్రపోతే డబ్బు ఎత్తుకెళదామని ఎదురు చూసిన దొంగ సూరిబాబుకు నిద్రొచ్చింది. అంతే అక్కడే పడకేశాడు. గురక పెట్టి మరీ నిద్రపోయాడు.
తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో గదిలో నుంచి గురక శబ్దం విన్న వెంకటరెడ్డికి మెలుకువ వచ్చింది. ఎవరిది ఈ గురక అంటూ ఇంట్లో వెతికాడు. చివరకు తన మంచం కిందనే పడుకున్న దొంగ కనిపించాడు. వెంటనే ఇంటికి గడియపెట్టి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి మంచం కింద నిద్రపోతున్న సూరిబాబును బయటకు తీసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంకటరెడ్డి వద్ద పెట్రోల్ డబ్బులు ఉన్నది చూసి కాజేయాలనుకుని వచ్చినట్లు పోలీసు విచారణలో సూరిబాబు నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.