వైద్యం నేడు కమర్షియల్ రంగులు పులుముకుని కోరలు చాచుతోంది. కరోనా తర్వాత ప్రైవేటు వైద్యం మరింత ప్రియంగా మారింది. అదొక వ్యాపారంగా మారిపోయింది. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేదీ వైద్యులకే. కానీ డాక్టర్లు..
వైద్యం నేడు కమర్షియల్ రంగులు పులుముకుని కోరలు చాచుతోంది. కరోనా తర్వాత ప్రైవేటు వైద్యం మరింత ప్రియంగా మారింది. అదొక వ్యాపారంగా మారిపోయింది. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేదీ వైద్యులకే. కానీ డాక్టర్లు.. అందిన కాడికి రోగుల నుండి డబ్బులు పిండేస్తున్నారు. చిన్న వైద్యానికే ఆసుపత్రిలో చేరమనడం లేదా ఖరీదైన మందులు రాయడం (అవి కూడా ఎక్కడా దొరకవు. కేవలం వారు చెప్పే మెడికల్ దుకాణాల్లో మాత్రమే దొరకుతాయి). అవసరమున్నా లేకున్నా ఆ పరీక్షలు, ఈ పరీక్షలు చేయించుకు రావాలంటూ షీటు మీద బరా బరా గీకేస్తుంటారు. ఇక సీరియస్ అయ్యి.. ప్రాణాలు పోతే.. డబ్బుల కోసం ఠాగూర్ సినిమాను కూడా చూపిస్తారు.
చనిపోయిన వ్యక్తికి కూడా ట్రీట్ మెంట్ చేస్తూ డబ్బులు గుంజుతారు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఠాగూర్లో. ఇదే సీన్ రిపిట్ అయ్యింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తాండూరు మండలంలోని ఐబి ప్రాంతానికి చెందిన జై కిషన్, కళావతి భార్యా భర్తలు. వీరికి మూడు నెలల చిన్నారి ఉన్నాడు. అయితే జలుబుతో బాధపడుతుండటంతో శుక్రవారం రాత్రి నిత్య పిల్లల ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా.. డబ్బుల కోసం ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు నాటకమాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వారికి సమాచారం అందించారు.
అయితే చిన్నారి ఉలుకు, పలుకు లేకపోవడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో కొద్ది గంటల క్రితమే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డబ్బుల కోసం నీచానికి ఒడిగట్టారని తెలిసి.. ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో ఆసుప్రతి సిబ్బంది.. తాళాలు వేసి అక్కడి నుండి పారిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అక్కడకు చేరుకున్న బెల్లంపల్లి పోలీసులు.. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. నిత్య ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని, విచారణ జరుపుతామని హామీనిచ్చారు.