ఆపిల్ సర్వీస్ సెంటర్ టెక్నీషియన్లు చేసిన నీచమైన పనికి ఆపిల్ సంస్థ భారీ జరిమానా చెల్లించబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని 2016లో తన ఐ ఫోన్ను రిపేర్ కోసం ఆపిల్ సర్వీస్ సెంటర్కు ఇచ్చింది. అయితే ఆ ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్టు అయ్యాయి. రిపేర్కు వచ్చిన ఫోన్లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది.
ఒరెగాన్లోని యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి తన యాపిల్ ఫోన్ రిపేర్కు రావడంతో 2016లో సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లింది. పెగట్రాన్ సంస్థ ఆ సర్వీస్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఫోన్ రిపేర్ చేసే క్రమంలో అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫోన్లోని ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను ఆన్లైన్లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న యువతి ఆ ఫొటోలను తొలగించింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో యాపిల్ సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
యువతి తరఫు లాయర్ 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 36 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే, కంపెనీ ఎంతమొత్తం చెల్లించిందీ తెలియరాలేదు. ఈ వ్యవహారం వల్ల మానసిక క్షోభ అనుభవించినందుకు గానూ యువతికి యాపిల్ భారీ మొత్తం చెల్లించింది. అంతర్గత విచారణలో తప్పు చేసినట్లు తేలడంతో ఆ ఇద్దరు ఉద్యోగులను యాపిల్ తొలగించింది. అనంతరం పెగట్రాన్ సంస్థ నుంచి చెల్లించిన మొత్తాన్ని రాబట్టినట్లు సమాచారం. తొలుత పెగట్రాన్ ఆ సొమ్ము చెల్లించేందుకు నిరాకరించినప్పటికీ అనంతరం ప్రైవేటుగా సెటిల్మెంట్ చేసుకున్నట్లు ‘టెలిగ్రాఫ్’ పేర్కొంది.