సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు, తమ ఏడేళ్ల కూతురితో పాటు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన స్థానికులను కలచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండల పరిధిలోని పోతాయిపల్లికి చెందిన తింగుళ్ల శ్రీకాంత్ గౌడ్(42), అల్వాల్ వెంకటాపురానికి చెందిన అనామిక(40) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల పాప(శ్రీస్నిగ్థ) ఉంది. ఏడేళ్ల క్రితం ఈ దంపతులు అమీన్ పూర్ పరిధిలోని బీరంగూడ, వందనపూరి కాలనీలో సొంత ఇల్లు కొనుక్కొని నివాసం ఉంటున్నారు.
శ్రీకాంత్ టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా, అనామిక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఏమైందో తెలియదు కానీ, రెండు రోజులుగా ఈ దంపతులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళలేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి కాల్ చేసినా స్పందించలేదు. దీంతో వందనపూరి కాలనీలోని అల్లుడి ఇంటికి వచ్చి చూడగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉండటం గమనించాడు.
వెంటనే శ్రీరామచంద్రమూర్తి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా.. ఓ గదిలో అనామిక, కూతురు స్నిగ్ధ నోట్లో నుండి నురగలు కక్కి విగతజీవులయ్యారు. పక్క గదిలో శ్రీకాంత్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ముగ్గురు విగతజీవులై కనిపించేసరికి కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖాన్ని ఆపుకోలేక రోదించారు.
ఇదిలా ఉండగా.. చనిపోయిన ముగ్గురి నుదుటిన ఎర్ర బొట్టు ఉండటం, దేవుని గదిలో చిత్రపటాలు చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఈ విషాద ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.