పాఠశాలల్లో విద్యార్థినిల పట్ల వేధింపుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవంలా భావించే ఉపాధ్యాయులు విద్యార్థినిల పట్ల వేధింపులకు పాల్పడుతు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు దారితప్పుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు వారి వికృతచేష్టలతో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. ఎక్కడో ఓ చోట వేధింపులకు గురవుతూ మృగాళ్ల చేతిలో బలవుతున్నారు. ఆలయంగా భావించే బడిలో టీచర్లు విద్యార్థినిలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ లోని ఎస్ ఆర్ డిజీ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ విష్ణు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు.
గతంలో బంజారాహిల్స్ లో ఓ స్కూల్ బస్ డ్రైవర్ విద్యార్థినిని వేదించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా అత్తాపూర్ లోని ఎస్ ఆర్ డిజీ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల పీఈటీగా పనిచేస్తున్న విష్ణు అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పేరెంట్స్, బంధువులు స్కూల్ కు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్ ఫర్నీచర్ ను, కంప్యూటర్ రూమ్ ను ధ్వంసం చేసారు. ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యుడైన పీఈటీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనతో స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థి యూనియన్లు ధర్నా చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.