రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని సంబంధింత శాఖ అధికారులు ఎప్పుడూ అంటుంటారు. కానీ అక్కడక్కడ రైల్వే ప్రయాణికులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా రైల్వే ప్యాంట్రీ సిబ్బంది ఓ ప్రయాణికుడిపై దాడి చేశారు. కదిలే రైలు నుంచి ఆ ప్రయాణికుడిని బయటకు తోసేశారు. వారి మధ్య నీళ్ల బాటిల్ విషయంలో వాగ్వాదం మొదలై.. చివరకు రైలులో పాన్ మాసాలా ఉమ్మేశాడంటూ ప్యాంట్రీ సిబ్బంది దాడికి తెగపడే వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లో రవి యాదవ్(26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో రైలు జిరోలి స్టేషన్ కి చేరుకున్న సరికి ప్యాంట్రీ సిబ్బందితో వాటర్ బాటిల్ విషయంలో రవి గొడవ పడ్డాడు. అది చిలికి చిలికి దుమారం రేపింది. ఈ విషయం మనస్సులో పెట్టుకున్న సిబ్బంది.. రవి యాదవ్ పై కక్ష కట్టారు. రైలులో పాన్ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో లలిత్పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు. ఈ మధ్యలో రైలు కదిలింది. అతడిని రైలులోకి లాగి.. చితబాదారు.
అనంతరం కదిలే రైలులో నుంచి పట్టాలపైకి తోసేశారు. రవిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్లు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని.. ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.