సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి హైదరాబాద్ వలస వచ్చిన బాధిత బాలిక కుటుంబం సైదాబాద్ లోని పూసల బస్తీలో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. పెద్ద కూతురు జ్వరంతో ఇంట్లోనే ఉండగా.. చిన్న కుమార్తె ఇంటి బయట ఆడుకుంటోంది. అయితే ఇంటి పక్కనే ముగ్గురు బాలురు.. మేడ మీద గాలిపటాలు ఎగుర వేస్తున్నారు. అదే సమయంలో కింద ఆడుకుంటున్న మైనర్ బాలికను.. ఆడుకుందాం రా అంటూ మేడ మీదకి పిలిచారు. అన్నయ్యలతో ఆడుకుందామని వెళ్ళింది.
గాలిపటాలు పక్కన పడేసి.. ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూస్తూ.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనకు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో కూడా తెలియని ఆ చిన్నారి.. ఏడుస్తూ కిందకి వచ్చేసింది. పని ముగించుకుని వచ్చిన తల్లి.. తన కూతురు చలాకీగా లేకపోవడం చూసి ఏమైందని అడుగగా.. జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒకరి వయసు 16, ఒకరి వయసు 11 కాగా మరొకరు వయసు 9 సంవత్సరాలు. మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో తప్పెవరిది? ఆ వయసుకు సెల్ ఫోన్లు ఇచ్చి.. వాళ్ళు ఆ ఫోన్లలో ఏం చూస్తున్నారో కూడా పట్టించుకోలేని తల్లిదండ్రులదా? లేక అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసే నిర్వాహకులదా?
గాడిదల్లా ఎదిగిన పెద్ద వాళ్ళే అత్యాచారం చేయడం తప్పని తెలిసి చేస్తున్నారు. మరి ఏది తప్పో.. ఏది ఒప్పో తెలియని వయసు మైనర్లది. ఆ వయసులో వారిని అత్యాచారం చేసేలా ప్రేరేపిస్తున్న అంశాలు ఏమిటి? తోటి ఆడపిల్లలతో కలిసి ఆడుకునే వయసులో.. చెడు బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటి? అశ్లీల చిత్రాలు, పెంపకం మాత్రమేనా? ఎవరెలా పోతే మాకేంటి అని ఇష్టమొచ్చినట్టు చెత్త సినిమాలు తీసేవారిదా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ దగ్గర పరిష్కారం ఉంటే షేర్ చేయండి.