ఒక 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసిన వాడు చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని కోర్టుకు లాక్కొచ్చి 14 ఏళ్లు శిక్ష పడేలా చేసింది బాధితురాలి తల్లి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది కదూ. కానీ ఇది నిజంగా జరిగిన కథ. అసలు చనిపోయిన వ్యక్తిని బతికించడం ఏమిటి? అతన్ని కోర్టుకు తీసుకొచ్చి జైలు శిక్ష పడేలా చేయడం ఏమిటి? ఆ కథేంటో మీరే పూర్తిగా చదివేయండి.
రంగస్థలం సినిమాలో తన అన్నను చంపిన విలన్, చావు బతుకుల్లో ఉంటే చిట్టిబాబు బతికించి చంపుతాడు. కానీ ఇక్కడ చచ్చిన వ్యక్తిని బతికించి.. మరీ కోర్టు మెట్లెక్కించింది ఓ మహిళ. అది 2018 అక్టోబర్ నెల. 12 ఏళ్ల బాలికపై ఒక ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఆ బాలిక చెరకు తోటలో ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు. అత్యాచార ఘటనను కెమెరాలో రికార్డ్ చేశానని, ఈ విషయం బయటకు చెప్తే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే తనకున్న ఇన్ఫ్లుయన్స్ తో 2 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి తన పోరాటాన్ని ఆపలేదు. అయితే గత ఏడాది ఫిబ్రవరి 27న కీచకుడు చచ్చాడని కోర్టు కేసుని కొట్టివేసింది. తన కొడుకు చనిపోయాడంటూ నిందితుడి తండ్రి కోర్టులో తెలియజేశాడు.
చనిపోయాడనడానికి సాక్ష్యంగా.. కొడుకు దహన సంస్కారానికి సంబంధించిన రెండు ఫోటోలు, కర్మ కోసం కొనుగోలు చేసిన కట్టెల రశీదును కోర్టులో సబ్మిట్ చేశాడు. 2 నెలల తర్వాత కోర్టులో కొడుకు మరణ ధృవీకరణ పత్రాన్ని చూపించడంతో.. పరిశిలించిన కోర్టు కేసును గత ఏడాది మే నెలలో కొట్టివేసింది. అయితే నిందితుడు చనిపోయాడన్న విషయాన్ని బాలిక తల్లి నమ్మలేదు. ఖచ్చితంగా బతికే ఉన్నాడని ఆమెకు అనిపించింది. చనిపోయాడని అబద్ధం చెప్పి.. అతను దాక్కున్నాడని ఆమె నమ్మింది. ఎలాగైనా బతికే ఉన్నాడని నిరూపించాలనుకుంది. అతను బతికే ఉన్నాడని చెప్పినా ఎవరూ నమ్మలేదు. దీంతో ఆమె తానే స్వయంగా రంగంలోకి దిగింది.
ఒక వ్యక్తి మరణిస్తే చుట్టుపక్కల గ్రామాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ నిందితుడైన ఉపాధ్యాయుడి మరణం గురించి చుట్టుపక్కల ఊర్లలో ఎవరికీ తెలియలేదు. ఇంటింటికీ తిరిగి చనిపోయాడా? అని అడిగింది. ఎవరినీ అడిగినా తమకు చనిపోయిన విషయం తెలియదంటున్నారు. ఇక్కడ నిందితుడు చనిపోలేదు అన్నందుకు ఒక ఆధారం దొరికింది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే కర్మలు నిర్వహిస్తారు. కానీ కుటుంబ సభ్యులు కర్మ నిర్వహించలేదు. దీంతో ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది. బతికే ఉన్నాడని నిర్ధారించుకుని.. మళ్ళీ కోర్టు మెట్లెక్కింది. అయితే కోర్టుకు అతను బతికే ఉన్నాడనడానికి సాక్ష్యాలు కావాలని అడిగారు.
గ్రామ కౌన్సిల్ నకిలీ పత్రాల ఆధారంగా నిందితుడి మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిందని, దీనిపై దర్యాప్తు చేయాలని స్థానిక సీనియర్ అధికారి వద్ద పిటిషన్ వేసింది. ఆ అధికారి కేసును వేగవంతం చేశారు. గ్రామ కౌన్సిల్ ను విచారణకు ఆదేశించారు. గ్రామ సభ సభ్యులు.. నిందితుడి తండ్రిని కొడుకు మరణానికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలను కోరారు. నిందితుడి మరణం తర్వాత తీసిన ఫోటోలు, దహన సంస్కారాలు, మండుతున్న చితి, అంత్యక్రియలు, తాజాగా ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను గ్రామ సభ సభ్యులు కోరారు. 250 ఇళ్ళు ఉన్న గ్రామంలో అందరినీ అడిగి నిందితుడు చనిపోయాడా? లేదా? వాకబు చేశారు. అందరూ తమకు తెలియదని చెప్పారు.
ఇక ఇంట్లో ఎవరైనా చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకుంటారు. కానీ నిందితుడి కుటుంబ సభ్యులు ఎవరూ గుండు కొట్టించుకోలేదు. అలానే నిందితుడి బంధువులకు కూడా నిందితుడి మరణ వార్త తెలియదు. ఒకేవేళ నిజంగా చనిపోయి ఉంటే ఇంట్లోనే అంత్యక్రియలు నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామ సభ సభ్యులు నిందితుడి తండ్రిని మళ్ళీ ప్రశ్నించారు. అయితే తన కొడుకు మరణించాడనడానికి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించినట్లు తేలింది.
చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడి తండ్రిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. తండ్రిని అరెస్టు చేయడంతో అసలు నిందితుడు వెలుగులోకి వచ్చాడు. చనిపోయినట్లు ప్రకటించిన 9 నెలల తర్వాత కోర్టులో లొంగిపోయాడు. మే 23 2022న నిందితుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కోర్టు రద్దు చేసింది. జూలై 2022లో కోర్టు కేసును మళ్ళీ ప్రారంభించింది. నిందితుడికి గత నెలలో 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక బాధితురాలికి రూ. 3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు కుట్రలో భాగం పంచుకున్న నిందితుడి తండ్రి జైల్లో ఉన్నాడు. కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. న్యాయం కోసం బాధితురాలి తల్లి మూడేళ్ళ పాటు తిరగగా.. ఇప్పటికి న్యాయం జరిగింది.
చనిపోయిన వ్యక్తిని బతికే ఉన్నాడని నిరూపించడానికి చాలా ఖర్చు అవుతుంది. పైగా నిందితులు జైలు నుంచి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటారని కొంతమంది భయపెట్టారు. అయినా ఆమె భయపడకుండా పోరాటం చేసింది. చివరికి న్యాయాన్ని గెలిపించింది. ఆమె బీహార్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నిందితుడి పేరు నీరజ్ మోదీ అని, నిందితుడి తండ్రి పేరు రాజారామ్ మోదీ అని జాతీయ మీడియా ప్రచురించిన కథనంలో పేర్కొంది. అలా కోర్టు దృష్టిలో చనిపోయిన వ్యక్తిని బతికించి జైలుకి పంపింది. మరి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు కోర్టుని నమ్మించి.. సంతోషంగా తిరుగుతున్న మాస్టార్ ని తెలివిగా బతికే ఉన్నాడని నిరూపించి.. కోర్టు మెట్లెక్కించి.. 14 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేసిన ఆ తల్లిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.