ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై జరిగే దురాగతాలు ఆగడం లేదు. ఇతర దేశాల్లో తెలుగు విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన తేజస్విని అనే అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపాడు ఓ దుండగుడు. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.
ఉన్నత చదువుల కొరకు చాలా మంది తెలుగు విద్యార్థులు ఇతర దేశాలకు వెళుతున్నారు. విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. టెక్సాక్ కాల్పుల్లో మన హైదరాబాద్ యువతి ఐశ్వర్య మృతి చెందిన ఘటన మరువక ముందే మరో యువతిపై దాడికి పాల్పడ్డారు. లండన్లో మరో హైదరాబాద్ అమ్మాయిపై బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ దాడిలో మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తేజస్విని పై చదువుల కోసం లండన్ వెళ్ళింది. తేజస్విని హైదరాబాద్ చంపాపేటకు చెందిన యువతి. లండన్లో స్నేహితులతో కలిసి ఉంటుంది. ఓ యువకుడు తేజస్వినితో పాటుగా అఖిల అనే మరో విద్యార్థినిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. మరో యువతి అఖిల తీవ్ర గాయాలపాలయింది. అఖిలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడు బ్రెజిల్కు చెందిన యువకుడుగా గుర్తించారు. అసలు ఇద్దరు అమ్మాయిలపై దాడికి పాల్పడడానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తేజశ్విని మృతి చెందిన సమాచారం తల్లిదండ్రులకు తెలియజేశారు. కూతురు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంతో వస్తుందనుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కూతురు మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. తేజస్విని మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.