రెండు తెలుగు రాష్ట్రాల్లో నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. యువతి కోసం మిత్రుడిని అతి కిరాతకంగా, రాక్షసంగా హత్య చేశాడు. అతడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే పోలీసుల రిమాండులో హరిహర కృష్ణ కొన్ని విస్తుపోయే సమాధానాలు చెప్పాడట.
ప్రేమించిన అమ్మాయి కోసం మిత్రుడిని హత్య చేసిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిదో అందరికీ తెలుసు. స్నేహితుడని కూడా చూడకుండా నవీన్ ను హరిహర కృష్ణ అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధం ఉండచ్చని అనుమానులు వచ్చాయి. ఆ యువతి అసలు విచారణకు సహకరించలేదు. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆమె తీరు మారలేదు. అయినా చివరికి ఈ కేసుతో ఆ యువతికి ఎలాంటి సంబంధం లేదంటూ రాచకొండ సీపీ ప్రకటించారు. ప్రస్తుతం హరిహర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో హరిహర కృష్ణ విస్తుపోయే నిజాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
హరిహర కృష్ణను వారం రోజులపాటు రిమాండులోకి తీసుకునేందుకు కోర్టు గత గురువారం అనుమతినిచ్చింది. మొదట్లో హరిహర కృష్ణ పోలీసులకు సహకరించలేదని తెలిసింది. కానీ, తర్వాత హరిహర కృష్ణ మాటలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారట. అంత ఘోరంగా అతను సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి పోలీసులు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటకు చెప్పింది లేదు. కేసు విచారణలో ఉన్న సమయంలో దర్యాప్తునకు సంబంధించి వివరాలు వెల్లడించకూడదన్నారు. కానీ రిమాండులో హరిహర కృష్ణ చెబుతున్న సమాధానాలు ఇలా ఉన్నాయి అంటూ బయటకు వార్తలు వచ్చాయి.
మిత్రుడిని చంపినందుకు అతనిలో ఏ కోశాన పశ్చాతాపం కనిపించడం లేదట. పైగా యూట్యూబ్ లో క్రైమ్ సీన్లు చూసి ఈ హత్య చేసినట్లు చెప్పాడట. అంతేకాకుండా “నేనొక్కడే ఈ హత్య చేశాను. ఈ కేసుతో ఇంక ఎవరికీ సంబంధం లేదు. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించాను. నన్ను మీరేమీ పట్టుకోలేదు.. నేనే మీకు లొంగిపోయాను. నాకు చట్టం గురించి తెలుసు. విచారణ తర్వాత మీరు నన్ను జైలుకు పంపాల్సిందే. కోర్టు నాకు యావజ్జీవ శిక్ష వేయదు. నేను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను” అంటూ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. హరిహర కృష్ణ మాటలకు పోలీసులే ఆశ్చర్యపోతున్నారట. హరిహర కృష్ణ సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.