క్రికెటర్లు, సినీ ప్రముఖుల పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో భారీ మోసానికి తెరదీసిందో హైటెక్ ముఠా. సెలబ్రిటీల పేర్లతో క్రెడిట్ కార్డులు సంపాదించి ఓ సంస్థకు కుట్చుటోపీ పెట్టింది. అసలు ఏం జరిగిందంటే..!
సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసం చేయడం ఈమధ్య కాలంలో ఎక్కువైపోయింది. క్రికెటర్లు, సినీ ప్రముఖుల పేర్లు చెప్పి.. అమాయకుల నుంచి డబ్బులను లాగేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మరో ఘటన తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీల వివరాలతో తప్పుడు పాన్ కార్డులు.. అలాగే ఆధార్ వివరాలతో క్రెడిట్ కార్డులు పొంది ఏకంగా రూ.50 లక్షలకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఆన్లైన్లో వారి జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్లు సంపాదించి.. ఫేమస్ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ వన్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు పొంది హైటెక్ మోసానికి పాల్పడ్డారు. సంస్థ కంప్లయింట్తో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీతో పాటు బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, సైఫ్ అలీఖాన్, అలియా భట్, శిల్పాశెట్టి, ఇమ్రాన్ హష్మి తదితరుల వివరాలు నిందితుల దగ్గర ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు వీళ్ల వివరాలు ఎలా సేకరించారంటే.. ఈ మోసానికి పాల్పడే ముందు సెలబ్రిటీల వివరాలను గూగుల్లో సంపాదించారు కేటుగాళ్లు. డేట్ ఆఫ్ బర్త్, పాన్ ఇన్ఫర్మేషన్ లాంటివి గూగుల్లో లభించడంతో వీరు కొత్త పాన్ కార్డుకు వారి వ్యక్తిగత ఫొటోలతో దరఖాస్తు చేశారు. వీడియో వెరిఫికేషన్ టైమ్లో పాన్/ఆధార్ వివరాలు వారి ఫొటోలు సరిపోయే విధంగా ముందే జాగ్రత్త పడ్డారు. ఉదాహరణకు ధోనీని తీసుకంటే.. పాన్ కార్డు వివరాలు ఆయనవి ఉంటాయి. కానీ ఫొటో మాత్రం మోసగాడిది ఉంటుంది. అలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు కేటుగాళ్లు.
ఇదే పద్ధతిలో ఆధార్ వివరాలు కూడా పొందెందుకూ ప్రయత్నించారు. అయితే ఈ రెండూ దొరికాక వన్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా జవాబులు ఇచ్చారు కేటుగాళ్లు. మొత్తానికి నకిలీ వివరాలతో క్రెడిట్ కార్డులు సంపాదించారు. ఆ కార్డుల్లో లక్షల్లో క్రెడిట్ లిమిట్ ఉండటంతో ఆ మొత్తాన్ని వారం వ్యవధిలోనే ఉపయోగించారు. పైగా ఆ మొత్తాన్ని వన్ప్లస్ కంపెనీకి తిరిగి చెల్లించలేదు. దీంతో మోసాన్ని గుర్తించిన ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పునీత్, మహ్మద్ అసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిశార్, విశ్వభాస్కర శర్మను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.