మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారనడానికి నిత్యం పెరిగిపోతున్న మోసాలే నిదర్శనం. తాజాగా రాజమండ్రికి చెందిన ఓ మాయగాడు ఏకంగా 40 కోట్లకు పైగా కాజేశాడు. ఆన్ లైన్ మ్యారేజ్ సైట్స్ లో రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళల్ని లక్ష్యంగా చేసుకుని లక్షలు మింగేశాడు. దానంలో కర్ణుడ్ని అని ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. నాకంటే మంచోడు ఈ భూమ్మీద లేడు అని డబ్బా కొట్టుకుంటాడు. కట్ చేస్తే ఆడ లేడీస్ ఈ బిల్డప్ సీన్లకి పడిపోయారు. కళ్ళు మూసి తెరిచేలోపు లక్షలు కోల్పోయారు. ఇప్పుడు “ఏమీ సేతుర సామి, ఏమీ సేతు” అంటూ పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసులు చూస్తూ ఊరుకోరుగా. గాలం వేసి అమ్మాయిల్ని మోసం చేసిన మాయగాడ్ని.. పోలీసులు వల వేసి పట్టేసుకున్నారు. మే నెలలో పోలీసుల చేతుల్లో చిక్కిన ఈ కిలాడీకి సంబంధించిన మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రామచంద్రరావుపేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ(31).. ఈజీ మనీ కోసం అందరిలా స్మార్ట్ వర్క్ నో, హార్డ్ వర్కునో ఎంచుకోలేదు. దుర్మార్గులు ఎంచుకునే మోసపు మార్గాన్ని ఎంచుకున్నాడు. బీటెక్ చేసిన వంశీ కృష్ణ, 2014లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కూకట్ పల్లిలో ఓ హోటల్ లో పనిచేశాడు. 2015లో పని చేయాలన్న ఇంట్రస్ట్ పోయిందేమో.. కుర్రాడు క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగుల్లో డబ్బులు తగలేసినట్టున్నాడు. 2016లో మళ్ళీ జాబ్ కోసం కన్సల్టెన్సీ, ట్రావెల్ ఆఫీసుల్లో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగాలిప్పిస్తానని 10 మంది యువకులను మోసగించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాకయినా మంచిగా బతుకుదామని లేదు. మళ్ళీ అదే దొంగ బుద్ధి చూపించాడు. మాధురి చౌకి, గాయత్రి, శ్వేత, సాత్విక, జెస్సీ అంటూ అమ్మాయిలు పేర్లతో ఇన్స్టాగ్రామ్ లో 94 నకిలీ ఖాతాలు తెరిచాడు. మహిళలకు, యువతులకు తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. ఈ నకిలీ ఖాతాల నుండి “సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు దారబోస్తున్నా” అంటూ తన ఒరిజినల్ అకౌంట్ ను ట్యాగ్ చేసుకుని డప్పు కొట్టుకునేవాడు. ఇది నిజమని 1000 నుండి 1500 మంది మహిళలు నమ్మారు.
ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, సేవా కార్యక్రమాల పేరుతో ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు లాగేవాడు. పరిచయమైన అమ్మాయిలు, మహిళలు ఎవరైనా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లక్ష నుండి 2 లక్షలు ఇచ్చేవాడు. తేరగా వచ్చిన డబ్బులు కాబట్టి ఇస్తాడన్న విషయం తెలియక పాపం ఈ అమాయక లేడీస్.. ఈ కిలాడీని చాలా మంచోడంటూ బాగా ప్రచారం చేసేవారు. ఇలా ప్రచారం పొందిన వంశీ కృష్ణను నమ్మి అనేక మంది మహిళలు మోసపోయారు. రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళలను టార్గెట్ గా చేసుకుని వారి వద్ద నుండి భారీగా డబ్బులు గుంజేవాడు. ఆరేళ్ళ వ్యవధిలో 1000 నుండి 1500 మంది మహిళలను, యువతులను మోసగించి.. వారి నుంచి రూ. 40 నుంచి 50 కోట్లు స్వాహా చేశాడని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. హర్ష, హర్షవర్ధన్, చెరుకూరి హర్ష అనే మారు పేర్లతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితమే ఈ మాయగాడు పోలీసులకు చిక్కాడు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇతని బ్యాంకు ఖాతాల్లో రూ. 4 కోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు లావాదేవీలను ఫ్రీజ్ చేయించారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఈ కేడీని.. పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టనున్నారు. మరి 1000 మందికి పైగా మహిళలను మోసం చేసిన ఈ మాయదారి మోసగాడిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తాగిన మత్తులో అత్తపై అల్లుడి దారుణం.. ఇంట్లో అందరూ చూస్తుండగా!
ఇది కూడా చదవండి: సొంత మరదలిపై మనసు పడ్డాడు.. పెళ్లి చేసుకోవాలనుకుని!