ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు ఇప్పటికే ఎన్నో చూశారు. కొందరు ప్రేమను అవకాశంగా వాడుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ప్రేమ పేరుతో హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
ప్రేమ.. ఈ పేరును ఎంతో మంది ఎన్నో విధాలుగా వాడుకుంటున్నారు. అవసరాల తీర్చుకోవడం కోసం కొందరు ప్రేమను వాడుకుంటున్న విషయం తెలిసిందే. మరికొందరు ప్రేమ పేరుతో హత్యలు కూడా చేసేస్తున్నారు. నాకు దక్కని అమ్మాయి మరెవరికీ దక్కకూడదు అంటూ హత్యలు చేసిన వారిని కూడా చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి అంతకు మించిన క్రూరుడు. తాను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే కాదు.. వాళ్ల కుటుంబం మొత్తం మీద దారుణానికి ఒడిగట్టాడు. నాటు తుపాకీతో ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. యువతి, ఆమె తండ్రి, తమ్ముడిపై కాల్పులు జరిపాడు.
ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజపూర్ జిల్లాలో వెలుగుచూసింది. సుభాష్ ఖరాడి(25) దేవాస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవాడు. అతనికి శివాని అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. కొన్నాళ్లు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయంలో వారి మధ్య విబేధాలు తలెత్తాయి. సుభాష్ ఖరేడీతో వివాహానికి యువతి కుటుంబం అంగీకరించలేదు. వారి ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయానికి శివాని కూడా కట్టుబడింది. అప్పటి నుంచి సుభాష్ ని దూరం పెట్టడం ప్రారంభించింది. తన ప్రేమను నిరాకరించిందని శివానిపై, పెళ్లికి నిరాకరించారని ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నాడు. రాత్రి ఓ నాటు తుపాకీ తీసుకుని యువతి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న శివానీ, ఆమె తండ్రి, తమ్ముడిపై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ కాల్పుల్లో యువతి తండ్రి అక్కడికక్కడే మరణించాడు. సోదరుడు, శివానీకి ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఘటనాస్థలం నుంచి పరారైన తర్వాత తన ఫేస్ బుక్ పేజ్ లో సుభాష్ ఒక పోస్ట్ పెట్టాడు. శివానీతో కలిసున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ప్రేమలో మోసం చేసింది. ఆమెకు తీరని బాధను ఇచ్చాను అంటూ క్యాప్షన్ జతచేశాడు. తర్వాత అతని మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద గుర్తించారు. రన్నింగ్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.