ఇటీవల కాలంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో కన్నుముశారు. నటీ మీనా భర్త విద్యాసాగర్, మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి.. ఇలా ఇటీవల కొంత మంది ప్రముఖులు వివిధ కారణాలతో మృతి చెందారు. తాజాగా ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేశ్ ఝున్ఝున్ వాలా కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేయశారు.
రాకేశ్ ఝున్ ఝున్ వాలా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్ లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో రాకేశ్ మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కాండ్రీ బ్రీచ్ హాస్పిటల్ కి తరలించారు. రాకేశ్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఆయన జీవిత నేపథ్య విషయానికి వస్తే..1960 జూలై 5న హైదరాబాద్లో రాకేష్ ఝున్ఝున్ వాలా జన్మించారు. ఆయనకు చిన్న తనం నుంచి వ్యాపారంపై, దానికి సంబంధించిన విషయాలపై అమితాసక్తి. అందుకే కాలేజీ విద్యార్ధిగా ఉండగానే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఓ వైపు చార్టర్డ్ అకౌంటెంట్(CA) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్గా వ్యాపారాన్ని ప్రారంభించారు.
స్టాక్ మార్కెటర్,ఛార్టర్డ్ అకౌంటెంట్, ,ఆప్టెక్, హంగామా మీడియాలకు ఛైర్మన్ గా వ్యవహరించారు. అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లకు డైరెక్టర్గా కూడా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్ ఝున్ వాలా ‘ఆకాశ ఎయిర్’ ను ప్రారంభించారు.