ఈపీఎఫ్ డిపాజిట్లకు చెల్లించే వడ్డీరేటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీరేటు పెంపు ప్రతిపాదనను ఆమోదించడంతో కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకమే ఈపీఎఫ్ఓ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. కంపెనీ కొంత మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తాయి. ఆ డబ్బు పీఎఫ్ ఖాతాదారులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. వివాహ ఖర్చులకు, మెడికల్ ఎమర్జెన్సీకి, ఇంటి నిర్మాణానికి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఫండ్ నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారులకు పీఎఫ్ ఖాతా ద్వారా సుమారు ఏడు లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం కూడా కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ క్రమంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. తాజాగా వడ్డీ రేటును పెంచుతు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ప్రతినెల ఉద్యోగి ఖాతాలో జమ అవుతున్న మొత్తానికి చెల్లించే వడ్డీని ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటు 8.15 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో దాదాపు ఐదు కోట్ల మంది ఈపీఎప్ఓ చందాదారులకు లబ్ధి చేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2023 మార్చిలో 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించనున్నట్లు ఈపీఎఫ్ఓ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ.. ఈరోజు అన్ని ఉద్యోగ కార్యాలయాలకు కేంద్రం సర్క్యూలర్ జారీ చేసింది. సవరించిన 8.15 శాతం వడ్డీ రేటును కలిపి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేసింది.