పెద్దలు ఎంత చేసినా, ఏం చేసినా పిల్లల కోసమే. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రతీ తల్లి, తండ్రి అనుకుంటారు. అందుకే తమకి కాస్తో, కూస్తో అవగాహన ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే పిల్లల కోసం పోస్టాఫీస్, బ్యాంకులు, పాలసీ కంపెనీలు చాలా పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించేది పొదుపు పథకాలకే. ఎందుకంటే వడ్డీ తక్కువైనా గానీ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఒకటి. ఈ పథకంలో నెల నెలా కొంత పెట్టుబడి చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 40 లక్షలు పొందవచ్చు. ఆ డబ్బు పిల్లల ఉన్నత చదువులకి బాగా ఉపయోగపడతాయి.
పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత మీ చేతికి 40 లక్షలు రావాలంటే.. నెలకి రూ. 12,500 చొప్పున ఏడాదికి లక్షన్నర పెట్టుబడి పెడుతూ వెళ్ళాలి. అలా మీరు 15 ఏళ్లలో పెట్టే పెట్టుబడి రూ. 22 లక్షల 50 వేలు అవుతాయి. దానికి ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం 7.1 శాతం వడ్డీ కలిపి 15 ఏళ్ల తర్వాత రూ. 18 లక్షల పైనే వస్తాయి. ఈ లెక్కన మొత్తం పొదుపు డబ్బు రూ. 40 లక్షలు పైనే వస్తుంది. పెట్టిన పెట్టుబడి రూ. 22 లక్షలు ఐతే.. వడ్డీ దాదాపు 20 లక్షలు అదనంగా వస్తుంది. ఇదే పథకాన్ని ఇంకో 5 ఏళ్లు పొడిగిస్తే.. రూ. 66 లక్షలకు పైగా అమౌంట్ చేతికొస్తుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే.. రూ. కోటి 3 లక్షలు వస్తాయి. పాతికేళ్ల పాటు నెలకి రూ. 12,500 చొప్పున మీరు పెట్టే పెట్టుబడి 37 లక్షల 50 వేలు ఐతే.. దానికి వడ్డీగా రూ. 73 లక్షలు అదనంగా ఈ పథకం కింద వస్తాయి.
పిల్లలు ఎదిగే సమయానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకంటే తక్కువ డబ్బు కూడా పొదుపు చేసుకోవచ్చు. పొదుపు చేసే పెట్టుబడి మీద రాబడి ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ ఈ స్కీమ్ కి అప్లై చేయచ్చు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేది ఈ విధంగానే. మధ్యతరగతి వారికి కష్టాలూ, కన్నీళ్లూ ఎప్పుడూ ఉండేవే. కష్టాల కడలిని ఈదుకుంటూ.. కన్నీళ్ళని దిగమింగుకుంటూ.. పిల్లల కోసం కష్టమైనా కొంత డబ్బుని ఇప్పటి నుంచి పొదుపు చేస్తా ఉంటే వారు ఎదిగే సమయానికి రెట్టింపు డబ్బు అయ్యి వాళ్ళ చదువులకి ఉపయోగపడుతుంది.