కరెన్సీ నోటు కాస్త చినిగిపోయిందా..? జేబులో పెట్టుకుంటే.. పెన్ ఇంక్ మరకలు అంటుకున్నాయా? లేదా నూనె మరకలు అంటుకున్నాయా? నీళ్లలో నాని.. రంగు మారిందా..? షాపులో కానీ, మార్కెట్ లో కానీ, బస్సులో కానీ తీసుకోవడం లేదా…అయితే చింతించాల్సిన పనిలేదు. అటువంటి నోట్లను కూడా ఇకపై మార్చుకోవచ్చు. ఆ సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కల్పిస్తోంది. అలాగే చెబుతారు కానీ.. పాటించరు లే అనుకుంటున్నారా.. ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు. ఇటువంటి నోట్లను మార్చుకోమని ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ చెప్పినా.. చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆర్బీఐ నిబంధనలు రూపొందించింది.
భారత్ లో కరెన్సీ నోట్లు వేటితో తయారు అవుతాయో తెలుసా..? 75 శాతం కాటన్, మిగిలిన 25 శాతం కాగితం లాంటి పదార్థాన్ని వినియోగించి.. కరెన్సీ నోట్లను తయారు చేస్తారు. వాడుకలోకి వచ్చాక, అనేక చేతులు మారాక.. వాటి రూపు రేఖలు మారిపోతుంటాయి. రంగు లేదా చినిగిపోవడం జరుగుతాయి. వీటిని తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. కానీ వీటిని మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మినహా మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదావకాశాన్ని కల్పించింది. అటువంటి నోట్లను మార్చుకోమని చెబితే.. అటువంటి బ్యాంకులకు రూ. 10 వేల ఫైన్ వేసేలా నిబంధనలు రూపొందించింది.
అయితే వీటిని ఎలా మార్చుకోవాలని అనుకుంటున్నారా..? కాస్త చినిగిన, లేదా రంగు మారిన, మరకలు అంటుకున్న నోట్లను తీసుకుని మీకు దగ్గరలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి, డిపాజిట్ ఫామ్ తీసుకుని, మనం మార్చుకోవాలనుకున్న కరెన్సీ నోట్ల వివరాలను నమోదు చేయాలి. డి నామినేషన్ వివరాలు పూర్తి చేసి.. మన బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. ఈ ఫామ్ తో పాటు డ్యామేజ్ అయిన నోట్లను కౌంటర్లలో ఇవ్వాలి. అయితే మతపరమైన నినాదాలు, రాజకీయ నినాదాలు, పూర్తిగా కాలిపోయిన నోట్లు, ఉద్దేశపూర్వకంగా చించిన నోట్లను ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు..మార్పిడి చేయాల్సిన అవసరం లేదు.
ఇలా మనం అందజేసిన నోట్లను.. ఆయా బ్యాంకుకు సంబంధించిన నోట్ల మార్పిడి విభాగానికి చెందిన సిబ్బంది పరిశీలిస్తారు. తడిచినా, నూనె లేదా రంగు అంటినా, కాస్త చినిగినా.. పూర్తి నగదు తిరిగి వస్తుంది. అయితే మరికొన్ని రకాలుగా దెబ్బతిన్న నోట్లకు డ్యామేజ్ అయిన తీరును బట్టి.. దానికి తగ్గట్లుగా కొంత నగదు చెల్లిస్తారు. ఏదైమైనా పనికి రావని, వాటిని వినియోగించలేమని ఓ మూలన పడేసి ఉన్న కరెన్సీ నోట్లను తీసి.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెళ్లి మార్చుకొని.. క్యాష్ చేసుకోండి. ఆర్ బి ఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి.