విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్పోర్ట్ ఉండాల్సిందే. విదేశాంగ శాఖ అధ్వర్యంలో పని చేస్తోన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్పోర్ట్ పొందగలం. అయితే ఈ సెంటర్లన్ని.. నగరాల్లోనే ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకుని.. అంత దూరం ప్రయాణించి.. క్యూలో నిల్చుని.. పాస్ పోర్ట్ తీసుకోవడం పెద్ద పని. అయితే ఇక మీదట పాస్పోర్ట్ పొందాలంటే.. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సమీపంలోని పోస్టాఫీస్కు వెళ్లి.. కావాల్సిన పత్రాలు సమర్పించి పాస్పోర్ట్ పొందవచ్చు. ఇక మీదట ఇండియన్ పోస్టల్ సర్వీస్ అయిన పోస్టాఫీస్ ద్వారా పాస్పోర్ట్ పొందే అవకాశాన్ని కల్పింస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. 428 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. పాస్పోర్ట్ పొందాలంటే.. పని మానుకుని.. గంటల తరబడి ప్రయాణం చేసే రిస్క్ తొలగించడం కోసం ఇలా పోస్టాఫీసుల్లోనే పాస్పోర్ట్ సేవలు అందిస్తోంది ప్రభుత్వం.
పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అనేవి పాస్పోర్ట్ కార్యాలయాలు అందించే ఫ్రంట్-ఎండ్ పాస్పోర్ట్ జారీ సేవలు అందిస్తాయి. ఈ కేంద్రాల్లో టోకెన్ జారీ నుంచి పాస్పోర్ట్ జారీ, రీ ఇష్యూ అప్లికేషన్ వరకు పలు రకాల సేవలను అందిస్తాయి.
ఇప్పుడు మీరు ఎటువంటి సమస్య లేకుండా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింట్ రసీదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి తప్పకుండా వెళ్లాలి అనేది గుర్తు పెట్టుకొండి.