కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి. పోనీ, అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్కనెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
మీకు పొదుపు చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. మిమ్మల్ని ధనవంతులను చేసే అనేక పథకాలు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్నాయి. అందులోనూ.. మార్కెట్ పరిస్థితులకు ప్రభావితం కాకుండా సురక్షితమైన రాబడి అందాలంటే పోస్టాఫీస్ పథకాలు ఎంతో నమ్మదగినవి కూడాను. పోస్టాఫీస్ అందిస్తోన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ కూడా అచ్చం అలాంటిదేనని చెప్పుకోవాలి. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం పొదుపు చేస్తే.. పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు. అందులోనూ..ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా అస్సలు ప్రభావితం కాదు. దీని వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతమున్న సురక్షిత పెట్టుబడి పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అతిముఖ్యమైనది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పథకం కూడాను. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాను 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఏదేని బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. ఖాతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి అంటూ లేదు. కాకుంటే.. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాల్సి ఉంటుంది. ఇండివిడ్యువల్ అకౌంట్ తెరవడానికి మాత్రమే వీలుంటుంది. జాయింట్ ఖాతా సౌకర్యం లేదు. పైగా ఈ పథకంలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
కనీసం రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేశాక.. కనీసం ఏడాదికి రూ. 500 అయినా పొదుపు చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు పెట్టుబడి మొత్తాన్ని కట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. ఈ పథకం లాకిన్ పీరియడ్.. 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా కొనసాగాలి అనుకుంటే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించుకుంటూనే అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు.
ఈ పథకం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే.. మెచ్యూరిటీ కాలవ్యవధి(15 సంవత్సరాల) తర్వాత స్కీమ్ ను 5 సంవత్సరాల కాలానికి రెండుసార్లు పెంచుకోవాలి. అంటే.. మీ పెట్టుబడి కాలవ్యవధి 25 ఏళ్లుగా మారుతుంది అన్నమాట. ఉదాహరణకు.. మీరు రోజుకు రూ. 417 లేదా నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లపాటు పొదుపు చేశారనుకోండి.. మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు. ఇందులో.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 18.18 లక్షలు మీకు ఆదాయం లభిస్తుంది.
ఇప్పుడు మెచ్యూరిటీ కాలవ్యవధిని మరో రెండు మార్లు 5 సంవత్సరాల కాలానికి పెంచుకుంటే.. 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ. 1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 65.58 లక్షలు మీకు అందుతుంది. అంటే ఒక వ్యక్తి తాను 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. అతడు రిటైర్మెంట్(55) అయ్యే సమయానికి కోటి రూపాయలు అందుతాయి. పైగా ఈ పథకంలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పథకంలో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితమైనవి. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.10 శాతం వార్షిక వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు.
గమనిక: పీపీఎఫ్ ఖాతాను పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించటం కుదరదు. అలాగే, వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా రాబడి మొత్తం ఉంటుంది. గుర్తుంచుకోగలరు.