ఉద్యోగస్తులు త్వరలోనే భారీ శుభవార్త విననున్నారా అంటే.. అవుననే అంటున్నాయి కేంద్ర వర్గాలు. దేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై త్వరలోనే ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఈపీఎఫ్ఓ సమర్పించిన విజన్ 2047లో పదవీ విమరణ వయసు పెంపుపై హామీ ఇచ్చింది. 2047వరకే ఎందుకంటే.. ఆ సమయానికి దేశంలో 60 ఏళ్లపైబడిన వారి సంఖ్య సుమారు 14 కోట్ల వరకు ఉండవచ్చని.. ఇంత భారీ మొత్తంలో ఉండటం వల్ల.. పెన్షన్ ఫండ్లపై తీవ్ర ప్రభావం పడనుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనలు చేసింది. ఇది పెన్షన్ సిస్టమ్లో అత్యంత కీలకమని ఈపీఎఫ్ఓ తన విజన్ 2047 నివేదికలో పేర్కొంది.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల.. దీర్ఘ కాల వ్యవధిలో పెన్షన్ కోసం చేసే డిపాజిట్లు, పీఎఫ్ డిపాజిట్లు పెరుగుతాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇవి ద్రవ్యోల్బణాన్ని కాస్త తగ్గిస్తాయని అభిప్రాయపడింది. అందుకే రిటైర్మెంట్ వయసు పెంపు గురించి ఉద్యోగులు, కంపెనీలతో పాటు ఇతర వాటాదారులతో త్వరలోనే చర్చలు ప్రారంభిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. అలానే తన విజన్ డాక్యుమెంట్ను రాష్ట్రాలకు పంపింది. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు అనేది.. అంత సమర్థవంతమైనది కాదని, దీనివల్ల యువత ఉద్యోగాల కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుందని.. ఫలితంగా నైపుణ్యాలు దుర్వినియోగమవుతాయని కార్మిక ఆర్థిక వేత్త కేఆర్ శ్యామ్ సుందర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రభుత్వ రంగ సంస్థ లేదా కార్పొరేట్ సంస్థను బట్టి 58 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉంది. అయితే పాశ్చాత్య దేశాల్లో ఇది కాస్త ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు కాగా.. డెన్మార్క్, ఇటలీ, గ్రీస్లలో 67 ఏళ్లుగా, అమెరికాలో 66 ఏళ్లుగా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.