బంగారం కొంటున్నారా? అయితే కొనే ముందు ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి. లేదంటే గ్రాము బంగారం దగ్గర రూ. 120 వరకూ నష్టపోయే అవకాశం ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం దగ్గర రూ. 1200 నష్టపోతారు. కాబట్టి నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.
బంగారానికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పండగైనా, పేరంటమైనా, ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, వేడుక ఏదైనా గానీ ఒంటి మీద బంగారం ఉండాల్సిందే. మహిళలే కాదు.. మగవారు సైతం బంగారం కొనేందుకు వెనుకడుగు వేయరు. అయితే ఎక్కువగా బంగారం వేసుకునేది మహిళలే కాబట్టి వారే ఎక్కువగా కొంటూ ఉంటారు. అవసరం బట్టి ధర ఎంతున్నా కొనేందుకు వెనుకడుగు వేయరు. అయితే మీరు బంగారం కొనే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఒక్కో గ్రాము దగ్గర మీరు రూ. 120 వరకూ నష్టపోయే అవకాశం ఉంది. మరి నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
ధర ఎంతున్నా కొనేందుకు పసిడి ప్రియులు ఎగబడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది బంగారు నగల వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్యనే హైదరాబాద్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయగా.. 15 మంది వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రతి ఏటా ఇలాంటి కేసులు 320కి పైగా నమోదవుతుండగా.. బంగారు వ్యాపారులకు రూ. 30 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నారు. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 5,471 ఉంది. ఒక మిల్లీ గ్రాము ధర రూ. 5.471 అవుతుంది. అయితే కొంతమంది వ్యాపారులు ఒక గ్రాము బంగారం దగ్గర 10 నుంచి 20 మిల్లీగ్రాముల తేడాతో మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
నిజానికి రాళ్లతో తయారు చేసిన బంగారు ఆభరణాలకు.. రాళ్ల విలువ వేరుగా నిర్ణయించి బిల్లు చేయాలి. కానీ కొంతమంది వ్యాపారులు రాళ్ల విలువ సెపరేట్ గా వేయడం పక్కన పెట్టి.. ఆభరణానికి మొత్తం బంగారం ధర నిర్ణయించి బిల్ చేస్తున్నట్లు తెలిసింది. దీని వల్ల కొనుగోలుదారులు ఒక్కో గ్రాము వద్ద రూ. 120 నష్టపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలానే కొన్ని బంగారం దుకాణాల్లో ఖచ్చితమైన బంగారం తూకం యంత్రాలు లేవని అధికారులు గుర్తించారు. మరికొందరు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లను రీసెట్ చేసుకోవడం లేదని.. ప్రతి ఏటా వ్యాపారులు అధికారుల వద్ద వెయింగ్ మిషన్లకు తనిఖీలు చేయించి సీల్ వేయించుకోవాలని చెబుతున్నా కానీ అలా జరగడం లేదని అన్నారు. తనిఖీల సమయంలో ఎన్ని కేసులు నమోదైనా ఈ విషయంలో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. అందుకే బంగారం కొనే ముందు కొనుగోలుదారులే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి బంగారం విషయంలో కొంతమంది వ్యాపారులు మోసాలు చేస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.