అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కస్టమర్ల భద్రతే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్ వివరాలు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తొలుత ఈ గడువు 2021 జూన్ 30వ తేదీ వరకు నిర్దేశించగా.. పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో అక్టోబరు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
నిత్యం మనం వివిధ కారణాలతో ఈ-కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరి యాప్స్, ఊబర్, ఓలా వంటివి ఉపయోగిస్తుంటాం. ఇవి అందించిన సేవలకు పేమెంట్స్.. ఆన్లైన్ ద్వారా (క్రెడిట్/డెబిట్ కార్డుతో) చెల్లింపులు చేస్తుంటాం. ఈ చెల్లింపులు చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ.. వంటి వివరాలను ఎంటర్ చేసి.. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లావాదేవీ పూర్తి చేస్తుంటాం. ఇలా చేసినప్పుడు మొదటిసారి మాత్రమే ఈ వివరాలు ఎంటర్ చేస్తుంటాం.
ఆ తర్వాత అదే వెబ్ సైట్ లేదా యాప్ లో ఎన్ని సార్లు లావాదేవీలు చేసినా వివరాలను మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మొదటిసారి లావాదేవీ చేసినప్పుడే మన కార్డు వివరాలు సేవ్ అయ్యుంటాయి. దీన్నే కార్డు-ఆన్-ఫైల్ (COF) అంటారు. ఈ సదుపాయం వల్ల వినియోగదారులకు సులభంగా సేవలు అందుతున్నప్పటికీ ఆయా యాప్ లలో సేవ్ అయిన మన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ టోకనైజేషన్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ కూడా ‘కార్డ్ ఆన్ ఫైల్’ విధానంలోనే అమలవుతాయి. కాకుంటే.. కార్డు వివరాలు ‘ఎన్క్రిప్టెడ్’ టోకెన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. అంటే.. కార్డు అసలు వివరాలను టోకెన్ అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్ తో భర్తీ చేస్తారన్నమాట. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్లు కార్డు వివరాలను వెల్లడించకుండానే ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకు కస్టమర్లు ఒరిజినల్ కార్డు డేటా స్థానంలో ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ను తీసుకోవాలి. ఈ టోకెన్ పొందాలంటే చెల్లింపు జరిపే సైట్లో టోకెన్ రిక్వెస్టర్ కు అభ్యర్థన పెట్టుకోవాలి.
సదరు సంస్ధ మీ అభ్యర్థనను మీ కార్డు నెట్ వర్క్ కు పంపిస్తుంది. కార్డు జారీదారు సమ్మతితో టోకెన్ను కార్డు నెట్ వర్క్ సంస్థ జారీ చేస్తుంది. ఇలా కార్డు వివరాలకు బదులుగా టోకెన్ ఇవ్వడాన్ని టోకనైజేషన్ అంటారు. అయితే.. కార్టు టోకనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. ఇష్టపడని వారు కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవొచ్చు. కేవలం దేశీయ ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే టోకనైజేషన్ వర్తిస్తుంది. ఈ టోకనైజేషన్ వల్ల సైబర్ మోసగాళ్ల చేతిలోకి కార్డు వివరాలు వెళ్లకుండా అడ్డుకట్టవేసినట్లవుతుంది.