అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కువ ధర పెట్టి పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి. అభివృద్ధి చెందుతున్న దాంట్లో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. వీటి కంటే కూడా అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పద్ధతి. తక్కువ రేట్లకు భూములు కొంటే ఎలాగూ డెవలప్ అయితే మంచి ధర పలుకుతుంది. మీరు కనుక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఏపీలో ఈ ఏరియాలు రెండేళ్లలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
భూమి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. బంగారం కంటే కూడా కొన్ని వందల రెట్లు భూమి ధర పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకు హైదరాబాద్ నగరమే ఉదాహరణ. కానీ ఒకప్పుడు హైదరాబాద్ కూడా సాదా సీదా పట్టణమే. పెట్టుబడులు, ప్రాజెక్టులు, కంపెనీలు వచ్చేసరికి డిమాండ్ పెరిగి భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి వలస వచ్చి జీవిస్తున్నారు. అందులో ఏపీ వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ లో మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నా కూడా భూమి కొనలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొంటున్నారు. కానీ హైదరాబాద్ కి 50, 100 కి.మీ. దూరంలో పెట్టుబడి పెడుతున్నారు. ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టయితే కనుక ఏపీలోనే మంచి ఏరియాలు ఉన్నాయి.
ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడి పెట్టినా గానీ ప్రాజెక్టులు పూర్తవ్వడానికి రెండేళ్ల నుంచి ఐదేళ్లు పడుతుంది. ఈ ఎదురుచూసేదేదో సొంత రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి ఎదురుచూడడం మంచిది. పైగా విశాఖలో రెండేళ్లలో పూర్తయ్యే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. వాటిలో ఒకటి ఇనార్బిట్ మాల్. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ని విశాఖపట్నంలోని కైలాసపురం ప్రాంతం వద్ద నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 600 కోట్ల పెట్టుబడితో 6 లక్షల చదరపు అడుగుల్లో అతిపెద్ద ఇనార్బిట్ మాల్ రెడీ అవుతోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజం.. కె రహేజా కార్పొరేషన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని రూపొందిస్తుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
రెండేళ్ల తర్వాత ఇనార్బిట్ మాల్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. అలానే ఈ సైట్ లో ఒక ఐటీ టవర్ ని నిర్మించడానికి కూడా రహేజా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 200 జాతీయ,అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం అన్నారు. ఈ భూమి ఇది జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఇక గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 138 కోట్ల రూపాయలతో ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఐదు కొత్త ప్రాజెక్టులను రూపొందిస్తుంది. సిరిపురంలో ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.
ఆంధ్రా యూనివర్సిటీ యొక్క టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ సహా ఆహా హబ్, ఏయూ డిజిటల్ జోన్, స్మార్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అల్గారిథం, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్ వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. ప్రధానంగా వైజాగ్ లోని కైలాసపురం, సిరిపురం ఏరియాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కైలాసపురంలో భూముల ధరలు చదరపు అడుగు రూ. 700 నుంచి రూ. 8 వేల రేంజ్ లో ఉన్నాయి. సగటున చదరపు అడుగు రూ. 4,500 పలుకుతోంది. సిరిపురంలో కూడా భూముల ధరలు రూ. 2,500 నుంచి రూ. 20 వేల రేంజ్ లో ఉన్నాయి. సగటున చదరపు అడుగు రూ. 10,700 పలుకుతోంది.
కైలాసపురంలో గజం కొనాలంటే రూ. 6,300 నుంచి రూ. 72 వేలు ఉన్నాయి. సగటున అయితే గజం రూ. 40 వేలు ఉంది. ఇక సిరిపురంలో అయితే గజం రూ. 22,500 నుంచి రూ. లక్ష పైనే పలుకుతోంది. సగటున రూ. 96 వేలు పలుకుతోంది. కైలాసపురం, సిరిపురం.. ఈ రెండు ఏరియాల్లో తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఈ ఏరియాలో ఇనార్బిట్ మాల్ సహా ఇతర ప్రాజెక్టులు పూర్తయితే స్థలాలకు డిమాండ్ అనేది పెరిగిపోతుంది. రెండేళ్లలో ఇనార్బిట్ మాల్ ప్రాజెక్ట్ పూర్తి అయితే కనుక రెండేళ్లలోనే ఊహించని లాభాలను పొందవచ్చు. స్థలం రేట్లు పెరగడం వల్ల ఆదాయం వస్తుంది. అలానే ఈ ఏరియాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో భూముల ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. కావున పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయానికి సుమన్ టీవీ బాధ్యత వహించదు.