2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున మోడీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కోవడంతో రాష్రాలన్నీ చాలా ఆశతో ఎదురుచూశాయి. అయితే, ఆ ఆశలు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆనందాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ 2023లో ఆశించిన కేటాయింపులు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మంత్రులు ఎన్ని లేఖలు రాసినా ఎలాంటి ప్రత్యేక ఊరట లభించలేదు. తూతూ మంత్రంగా.. కంటితుడుపు చర్యగా కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి.
15వ ఆర్థిక సంఘ సూత్రాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రా లకూ కలిపి రూ.1021,448.16 కోట్లు పంపిణీ చేస్తుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. కేంద్ర పన్నుల్లో అత్యధిక మొత్తం ఉత్తరప్రదేశ్ రూ. 1,83,237 కోట్లు, బిహార్ రూ.1,02,737.26 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.80,183.67 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ. 76,843.55 కోట్లు, మహా రాష్ట్ర రూ.64,524.88 కోట్లు, రాజస్థాన్ రూ. 61,552.47 కోట్లు రాష్ట్రాలకు వెళ్తోంది. 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మొత్తంలో 55.71 శాతం వాటా ఈ ఆరు రాష్ట్రాలకు దక్కుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల కేటాయింపులు ఇలా ఉన్నాయి..
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 683 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది.
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులకు రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్కు ఈఏపీ కింద రూ. 300 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1,473 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదన చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించింది. అలాగే, మంగళగిరి, బీబీనగర్ ఎయిమ్స్తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.6,835 కోట్లు కేటాయింపు అందించనున్నట్టు బడ్జెట్లో పేర్కొంది. మరోవైపు సాలార్జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2023పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.