ఒక్కరోజు మనవాళ్లు కనిపించకుంటే కంగారు పడతాము, ఆవేదన చెందుతాము. అదే ఆడపిల్ల అయితే ఇక ఆ భయం చెప్పలేనిది. అయితే వారు మానసికంగా సరిగ్గా ఉంటే మరుసటి రోజుకైన ఇంటికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఓ యువతి దారి తప్పి.. తన దారి తెలియక గోదావరి జిల్లాలో తిరుగుతుంది. ఆ యువతి ఎవరు? వివరాల్లోకి వెళ్తే..ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో తిరుగుతుంది. ఆ యువతి వయస్సు సుమారు21 ఏళ్ల . ఆమె గురువారం దొంతమూరు సమీపంలోని హైస్కూల్ వద్ద తోటలో ఉండగా కొందరు ఆకతాయిలు వేధిస్తుండడంతో స్థానిక వలంటీర్లు గుర్తించి ఆమెను రక్షించారు.
తరువాత ఆమె వివరాలు అడగగా తన పేరు గీత అని, ఊరు బందర్ అని మాత్రమే చెబుతోంది. ఎటువంటి వివరాలు చెప్పలేకపోతోంది. మతిస్థిమితం లేని ఆమెను గ్రామ సచివాలయం వద్దకు తీసుకువచ్చారు. మహిళా పోలీస్ పద్మావతి అంగన్ వాడీ వారికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి యువతిని శుభ్రపరచి బట్టలిచ్చి, అన్నం పెట్టారు. అనంతరం ఆ యవతిని రామచంద్రాపురం సంరక్షణ కేంద్రానికి తరలించారు.