చేతికి అంది వచ్చిన కొడుకు ఇక తమ బాధ్యతలు నిర్వర్తిస్తాడనే భరోసాతో ఆ తల్లిదండ్రులు ధైర్యంగా, ధీమాగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు కుమారుడికి అప్పగించి.. తాము విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మద్యం మహమ్మారి వారి ఇంట ఆరని చిచ్చు పెట్టింది. ఆసరాగా నిలుస్తాడని భావించిన కుమారుడు.. బతికున్న శవంలా మారాడు. బిడ్డ ఎన్నటికి కోలుకోలేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోకాన్ని దిగమింగుకుని తీసుకున్న నిర్ణయం మరో ఐదుగురి ఇంట దీపాలు వెలిగించింది. అవయవ దానం.. ఐదుగిరికి ప్రాణం పోసింది. ఆ వివరాలు..
విశాఖపట్నం జిల్లా గాజువాక, చినగంట్యాడకు చెందిన సిరపల్లి మురళీ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్నాడు. ఫుల్లుగా తాగిన తర్వాత.. మద్యం వియషమై వారి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. స్నేహితులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మురళీ తీవ్రంగా గాయపడ్డాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మురళిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇక అతడు ఎన్నటికి కోలుకోలేడని.. అతడి అవయవాలను దానం చేసి చావుబతుకుల్లో ఉన్న వారికి పునర్జన్మ కల్పించవచ్చని వైద్యులు మురళి తల్లిదండ్రులకు సూచించారు.కుమారుడి పరిస్థితి చూసి.. తీవ్ర విషాదంలో ముగినిపోయిన ఆ తల్లిదండ్రులకు ఈ ఆలోచన నచ్చింది. కుమారుడు అలా కదలిక లేకుండా పడి ఉండటం కన్నా.. అతడి అవయవాల ద్వారా మరి కొందరికి జీవితాన్ని ప్రసాదించడం ఎంతో మేలని భావించారు. అవయవ దానానికి అంగీకరించారు. దీంతో కిమ్స్ ఆస్పత్రిలోనే వైద్యులు దీనికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మురళీ స్నేహితులు ఏసుబాబుతో పాటు మరో ఇద్దరు యువకులు.. తమ స్నేహితుడు అవయవ దానం చేయడంతో అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నారు. మురళి తల్లిదండ్రుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.