ఇటీవల పలు పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను విచక్షణారహితంగా దండించిన ఘటనలో ఆస్పత్రిపాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే టీచర్లు కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి వారిపై దాడులకు తెగబడటం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు ఇచ్చే పనిష్మెంట్ తో కాళ్లూ, చేతులు చచ్చుపడిపోయిన ఆస్పత్రిపాలైన విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల్లో విద్యార్ధులపై శారీరక, మానసిక దాడులను తీవ్రంగా పరిగణిస్తూ అలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విద్యాశాఖ సైతం విద్యార్థులను శారీరకంగా హింసిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కొన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికం కొనసాగుతూనే ఉంది. తాజాగా విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ దారుణంగా ప్రవర్తించింది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం సీతమ్మధారలోని ఓప్రైవేట్ స్కూల్లో చిన్న పిల్లలను ఎండలో నిలబెట్టిన ఘటన కలకలం సృష్టించింది. సదరు టీచర్ చిన్నారులను షూ విప్పించి ఎండలో నిలబెట్టింది. కాళ్లు కాలుతున్నాయని పిల్లలు ఎంతగా ఏడ్చినా ఆ టీచరమ్మ ఏమాత్రం కనికరించలేదు. పైగా చేతిలో కర్రపుచ్చుకొని బెదిరించింది. దాంతో పిల్లలు బాధ ఓర్చుకొని మిన్నకున్నారు. అటుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు పిల్లల అవస్థ చూసి టీచర్ ని ప్రశ్నించారు. స్టూడెంట్స్ ఎంత పెద్ద తప్పు చేశారని వారినికి అలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారని ప్రశ్నించడంతో వారిపై టీచర్ సీరియస్ అయ్యారు.
విద్యార్థులు తప్పు చేశారని.. భవిష్యత్ లో మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని ఈ పనిష్మెంట్ ఇచ్చానని సదరు టీచర్ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు పరిమిషన్ లేకుండా ఎందుకు వీడియోలు, ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయ్యింది. స్థానికులతో టీచర్ వాగ్వాదం నడుస్తున్న సమయంలో మిగతా సిబ్బంది వచ్చి.. వదిలేయండి ప్లీజ్ అంటూ వీడియో తీస్తున్నవారిని వారించారు. తర్వాత విద్యార్థులను తరగతి గతిలోకి పంపించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.