ఈ మద్య కేటుగాళ్లు డబ్బు సంపాదించడానికి దేనికైనా సిద్ద పడుతున్నారు. దొంగతనాలు, కిడ్నాప్ లు చేసి బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖ లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్ ఉదంతం విశాఖలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం రిషికొండలోని ఎంపీ సత్యనారాయణ ఇంట్లో ప్రవేశించిన దుండగులు ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఎంవీవీ సత్యనారాయణ 2012 లో వైసీపీలో చేరారు. ఏపీలో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎం భరత్ పై గెలిచారు. తాజాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ ని ఉదయం కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంవీవీ హైదరాబాద్ లో ఉన్నారు. మొదట దుండగులు సీతమ్మధారలో ఉన్న ఆడిటర్ జీవీకి ఎంపీ భార్యతో ఫోన్ చేయించారు. ఆయన వచ్చిన తర్వాత ముగ్గురిని అపహరించారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా రౌడీ షీటర్ హేమంత్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం జీవి అనేక కంపెనీలకు ఆడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా ఎంవీవీ సత్యనారాయణ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం జీవి దగ్గరుండి చూసుకుంటున్నారను. కాగా, వ్యాపార గొడవలే కిడ్నాప్ కి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆడిటర్ జీవీ ఆచూకి పోలీసులు కనిపెట్టారు. ఆ తర్వాత విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు శరత్ ఆచూకీ కూడా లభించినట్లు తెలుస్తుంది. పోలీసులు అదుపులో కిడ్నాపర్లు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యిందని అంటున్నారు.