గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. భోజనం చేసి పుస్తకం తీద్దామని అనుకున్నాడు. మాయదారి గుండెపోటు ఆ కుర్రాడ్ని తీసుకెళ్ళిపోయింది.
గుండెపోటు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మొదట వృద్ధులకు, 50 ఏళ్ళు పైబడిన వారికి వచ్చేది. ఆ తర్వాత మెల్లగా 30 ఏళ్ల యువకులకు రావడం మొదలు పెట్టింది. ఇప్పుడు బడికెళ్లే చిన్నారులను కూడా వదలడం లేదు. ఎప్పుడు, ఏ క్షణంలో ఏ వయసు వారిని ఎత్తుకెళ్లిపోతుందో తెలియదు. చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఇటీవల కాలంలో అనేక మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో పాఠశాలకు వెళ్లే బాలురు ఉండడం బాధను కలిగిస్తోంది. ఆ మధ్య తొమ్మిదేళ్ల చిన్నారి క్యూ లైన్ లో ఉండగా కుప్పకూలిపడిపోయాడు. తాజాగా ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. 13 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం ఆందోళనకు గురి చేస్తోంది.
భోజనం చేసిన తర్వాత చదువుకుందామని వెళ్లిన బాలుడు ఊపిరాడడం లేదని గదిలోకి వెళ్ళాడు. అంతే ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సీ బాలుర హాస్టల్ లో ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పిడుగురాళ్ల పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. అక్కడే ఎస్సీ బాలుర హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే భోజనం తర్వాత స్టడీ అవర్ సమయంలో కోటి స్వాములు ఊపిరి ఆడడం లేదని తన స్నేహితులకు చెప్పాడు. దీంతో స్నేహితులు గాలి ఆడే ప్రదేశంలో కూర్చోమని సూచించారు.
బాలుడు గదిలోకి వెళ్లి ఫ్యాన్ కింద కూర్చునే ప్రయత్నం చేయగా కుప్పకూలి కింద పడిపోయాడు. అది గమనించిన నలుగురు స్నేహితులు కోటి స్వాములుని లేపేందుకు ప్రయత్నించగా లేవకపోడంతో వాచ్ మేన్ కు సమాచారం అందించారు. వాచ్ మేన్ వార్డెన్ గోపీనాయక్ కు చెప్పడంతో బాలుడ్ని వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని కోటి స్వాములు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆసుపత్రికి చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవడం పట్ల బాలుడి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి చిన్న వయసులో గుండెపోటుతో బాలుడు మరణించడానికి గల కారణం ఏమై ఉండవచ్చో? కామెంట్ చేయండి.