గతంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో నెల్లూరు ఒక్కటి. ఇటీవల వర్షాలు కాస్త తగ్గిన్నట్లు కనిపించాయి. నెల్లూరును వర్షాలు వీడటం లేనట్లుంది. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో గూడురు, మనుబోలు మధ్య రహదారిపై పంబలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పంబలేరు ప్రవాహంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా వానాలు నిలిచిపోయాయి.
వాహనాల్లోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధిచిన డ్రోన్ వీడియో అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు భారీ స్థాయిలో రావడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు నిండుకుండలా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చెరువుల పరిస్థితి కూడా ఇంతే. చాలా గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి, కరెంట్ కు, ప్రయాణానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేతు మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ పరిసర గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మర్రిపాడు మండలం పి.నాయుుడపల్లి, చంచులూరు గ్రామాలపైన ఉన్న చెరువులు ప్రమాదకర స్థాయిలో నీటి నిండి ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుతుందో అని స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా నాయుడుపేట పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్ల చుట్టూ చేరుతున్నాయి. ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలు మేత లేక అల్లాడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సోమశిల జలశయానికి నీటి ప్రవాహం పెరిగింది. జలాశయం ఇన్ ఫ్లో 96,569గా, ఔట్ ఫ్లో 1,15,369 క్యూసెక్కులుగా ఉంది. ఇంకా వానలు కురుస్తోన్న కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.