భారీ వర్షాల నేపథ్యంలో రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. దీంతో అధికారులు ప్రమాదాల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఓఆర్ఆర్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో చెరువులు, వాగులు ఉప్పొంగి వరదలు సంబవిస్తున్నాయి. పలు జిల్లాల్లో వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరదల కారణంగా నీట మునగడంతో జనాలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ భారీ వర్షాలతో గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతున్న రోడ్ మూసివేయనుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు లేన్లలో భారీగా నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా తిరిగి తెరుస్తామని అరవింద్ కుమార్ ప్రకటించారు. కాబట్టి వాహనదారులు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదలతో వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో వీలైనంత త్వరగా రోడ్డు మార్గాలను పునరుధ్దరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైతోంది.
Exit 2 & 7 closed due to water logging .. please avoid them
We will try and open them asap@KTRBRS pic.twitter.com/YUhVpdAQk0
— Arvind Kumar (@arvindkumar_ias) July 27, 2023