కుమారులు వంశం, ఇంటి పేరు నిలబెడతాడని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చే సరికి.. గుప్పెడు బువ్వ పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. వారి నుండి ఆస్తి పంపకాలు చేసుకుని.. పోషణ నిమిత్తం వంతుల వారీగా పంచుకుంటున్నారు.
పున్నామ నరకం నుండి తప్పించే వాడు కుమారుడని భావించే తల్లిదండ్రులు.. వారే పుట్టాలంటూ దేవుళ్లకు పూజిస్తుంటారు. వంశం, ఇంటి పేరు నిలబెడతాడని ఆశిస్తుంటారు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చే సరికి.. గుప్పెడు బువ్వ పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. వారి నుండి ఆస్తి పంపకాలు చేసుకుని.. పోషణ నిమిత్తం వంతుల వారీగా పంచుకుంటున్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా వృద్దాశ్రమాల్లో చేర్చుతున్నారు. లేదంటే ఇంట్లో నుండి గెంటేస్తున్నారు. దీంతో ఆదరణ కరువై నడి రోడ్డుపై పడుతున్నారు. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తల్లిదండ్రులను గెంటేశారు సుపుత్రులు. ఈ హృదయ విదారకమైన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఆస్తి పాస్తులు తమ పేరిట రాయాలని తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటేశారు ఇద్దరు కుమారులు. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసరావు, గుళ్లకమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు రామకృష్ణ, మల్లిఖార్జున రావు. వీరిలో పెద్ద కుమారుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని తమ్ముడు కూలీ పనులకు వెళుతుంటాడు. అయితే తల్లిదండ్రులు పేరిట ఉన్న పొలాన్ని.. తమ పేరిట రాయాలని ఒత్తిడి చేశారు. వారు ఒప్పుకోక పోవడంతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. వారిద్దని ఇంటి నుండి గెంటేసి.. తాళం వేసుకున్నారు. దీంతో వారు నడి రోడ్డున పడ్డారు. కనికరం లేని కొడుకులను చూసి తల్లి భోరుమంది. తమ వేదనను స్పందనలో వృద్ధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వీరి దీన స్థితిని చూసి గ్రామస్థులు ఆదుకున్నారు. గ్రామస్థుల సహకారంతో గుడిసె వేసుకొని ఉంటున్నారు ఈ వృద్ధ దంపతులు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.